IND vs ENG: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 73 పరుగులకే 5 వికెట్లు ఫట్..

ABN , First Publish Date - 2022-07-15T05:16:06+05:30 IST

లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డేలో టీమిండియా తడబడుతోంది. 73 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో..

IND vs ENG: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 73 పరుగులకే 5 వికెట్లు ఫట్..

లార్డ్స్: లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో వన్డేలో టీమిండియా తడబడుతోంది. 73 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో.. ఇంగ్లండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్య సాధన భారత్‌కు సవాల్‌గా మారింది. తొలి వన్డేలో రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేశాడు. టోప్లే బౌలింగ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ కూడా 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 25 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి విల్లీ బౌలింగ్‌లో బట్లర్‌కు కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ రాణిస్తే గానీ భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచే పరిస్థితి లేదు.



రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాసన్ రాయ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిర్ స్టో 38 పరుగులకు, రూట్ కూడా 11 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ 21 పరుగులు, లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ 150 పరుగుల లోపే ఆరు కీలక వికెట్లను కోల్పోయింది. అయితే.. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ, మరో ఆటగాడు డేవిడ్ విల్లీ నిలకడగా ఆడి జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశారు. మొయిన్ అలీ 47 పరుగులు, విల్లీ 41 పరుగులు చేశారు. ఓవర్‌టన్ 10 పరుగులు, కార్స్ 2, టోప్లే 3 పరుగులు చేశారు. దీంతో.. ఇంగ్లండ్ జట్టు 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్ చాహల్ 4 వికెట్లతో రాణించాడు. బుమ్రా, హార్థిక్ పాండ్యాకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ప్రసీద్ కృష్ణ, షమీకి చెరో వికెట్ దక్కింది.

Updated Date - 2022-07-15T05:16:06+05:30 IST