పాకిస్థాన్‌కు మరో కష్టం.. ఆలోచనలో పడిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2021-09-18T02:00:26+05:30 IST

పాకిస్థాన్‌కు కష్టాలు ఒకటిమీద ఒకటి వచ్చి పడుతున్నాయి. 2003 తర్వాత తొలిసారి న్యూజిలాండ్

పాకిస్థాన్‌కు మరో కష్టం.. ఆలోచనలో పడిన ఇంగ్లండ్

లండన్: పాకిస్థాన్‌కు కష్టాలు ఒకటిమీద ఒకటి వచ్చి పడుతున్నాయి. 2003 తర్వాత తొలిసారి న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం అడుగుపెట్టింది. దీంతో పాక్ క్రికెట్‌కు మళ్లీ పునర్వైభవం ఖాయమని అందరూ భావించారు. ఇక పాక్ వెళ్లేందుకు జట్లు అన్నీ ముందుకొస్తాయని భావించారు. అయితే, నేడు తొలి వన్డే ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో భద్రతా పరమైన కారణాలతో కివీస్ జట్టు మొత్తం సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి క్రికెట్ ప్రవపంచాన్ని నివ్వెరపరించింది.


ఈ షాక్ నుంచి పాకిస్థాన్ తేరుకోకముందే మరో కష్టం వచ్చి పడింది. వచ్చే నెలలో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. న్యూజిలాండ్ సంచలన నిర్ణయం నేపథ్యంలో ఇప్పుడు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పునరాలోచనలో పడింది. పాకిస్థాన్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


ఇంగ్లండ్ జట్టు చివరిసారి 2005లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాక్ పర్యటనకు సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే నెలలో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు రావాల్సి ఉంది. అయితే, న్యూజిలాండ్ తాజా నిర్ణయంతో ఇంగ్లండ్ పునరాలోచనలో పడింది. న్యూజిలాండ్ నిర్ణయం గురించి తమకు తెలిసిందని, ఆ జట్టు అక్కడే ఉంది కాబట్టి అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుందని ఈసీబీ పేర్కొంది. వచ్చే 24-48 గంటల్లో తమ నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తామని తెలిపింది. 

Updated Date - 2021-09-18T02:00:26+05:30 IST