బట్లర్‌ బాదేశాడు

ABN , First Publish Date - 2021-03-17T09:31:37+05:30 IST

ఐదు టీ20ల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 నాటౌట్‌) చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది...

బట్లర్‌ బాదేశాడు

  • మూడో టీ20లో ఇంగ్లండ్‌ విజయం 
  • కోహ్లీ అర్ధ సెంచరీ విఫలం

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. 86/5తో ఉన్న స్కోరును 156 పరుగులకు చేర్చినా.. బౌలర్లు, ఫీల్డింగ్‌ వైఫల్యం దెబ్బతీసింది. ఛేదనలో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ బౌండరీల వరద పారిస్తూ ఈ ఫార్మాట్‌లో తన అత్యధిక స్కోరును సాధించాడు. అలాగే తుది కంటా క్రీజులో నిలిచి ఇంగ్లండ్‌కు కీలక విజయాన్ని అందించాడు.


అహ్మదాబాద్‌: ఐదు టీ20ల సిరీ్‌సలో ఇంగ్లండ్‌ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 నాటౌట్‌) చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. బెయిర్‌స్టో (28 బంతుల్లో 5 ఫోర్లతో 40 నాటౌట్‌) అతడికి సహకరించాడు. దీంతో 2-1తో సిరీ్‌సలో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 నాటౌట్‌) చెలరేగాడు. ఉడ్‌కు 3 వికెట్లు దక్కాయి. హార్దిక్‌ (17)తో కలిసి ఆరో వికెట్‌కు కోహ్లీ అత్యధికంగా 70 పరుగులు జత చేశాడు. ఛేదనలో ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 రన్స్‌ చేసి గెలిచింది.  బట్లర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  


జోస్‌ హిట్టింగ్‌: ఈ పిచ్‌పై 157 పరుగుల ఛేదన కష్టంగానే అనిపించింది. అటు ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రాయ్‌ (9)ను చాహల్‌ నాలుగో ఓవర్‌లోనే అవుట్‌ చేయడంతో భారత్‌కు ఆశలు పెరిగాయి. కానీ అదే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన జోస్‌ బట్లర్‌ ఈసారి తన హిట్టింగ్‌ పవర్‌ చూపించాడు. ఐదో ఓవర్‌లో శార్దూల్‌ను 4,4,6తో వణికించాడు. ఆ తర్వాత చాహల్‌ కూడా మరో రెండు ఫోర్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీంతో పవర్‌ప్లేలో స్కోరు 57/1కి చేరింది. రెండో వికెట్‌కు మలాన్‌ (18)తో కలిసి 53 పరుగులు జోడించాడు. మధ్య ఓవర్లలో సుందర్‌, పాండ్యా  కట్టడి చేశారు. అయితే 14వ ఓవర్‌లో బట్లర్‌ బ్యాట్‌కు పనిచెబుతూ 4,6 బాదాడు. మరోవైపు అతడి రెండు క్యాచ్‌లను కోహ్లీ, చాహల్‌ వదిలేయడం కలిసొచ్చింది. అటు వరుస ఫోర్లతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. బెయిర్‌స్టోతో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జత చేశాడు.


24 పరుగులకే 3 వికెట్లు: ఆరంభంలో భారత బ్యాటింగ్‌ తీరు అచ్చం తొలి మ్యాచ్‌ను తలపించింది. దీంతో పవర్‌ప్లేలోనే టా పార్డర్‌ పెవిలియన్‌కు చేరి 24/3 స్కోరుతో జట్టు కష్టాల్లో పడింది. అయితే చివర్లో కెప్టెన్‌ కోహ్లీ విజృంభణతో గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. ఎక్స్‌ట్రా పేస్‌తో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ అదరగొట్టాడు. ఫామ్‌లో లేని రాహుల్‌(0)ను, విశ్రాంతి తర్వా త బ్యాట్‌ చేత పట్టిన రోహిత్‌ (15)ను తన వరుస ఓవర్లలో ఉడ్‌ పెవిలియన్‌ చేర్చా డు. అరంగేట్రంలో దుమ్ము రేపిన ఇషాన్‌ కిషన్‌ (4) తొమ్మిది బంతులకే పరిమితమై జోర్డాన్‌ చేతిలో వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీ, పంత్‌ (25) మూడో వికెట్‌కు 40 పరుగులు చేర్చారు. 12వ ఓవర్‌ తొలి బంతికి విరాట్‌ పిలుపుతో మూడో రన్‌ కోసం వెళ్లిన పంత్‌ రనౌటయ్యాడు. శ్రేయాస్‌ (9)ను కూడా కాసేపటికే ఉడ్‌ పెవిలియన్‌ చేర్చాడు.




కోహ్లీ దూకుడు: 15 ఓవర్లలో జట్టు స్కోరు 87/5. ఈ దశలో కనీసం 130 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ కెప్టెన్‌ కోహ్లీ డెత్‌ ఓవర్లలో పరుగుల వరద పారించాడు. 16వ ఓవర్‌లో 4,6తో స్కోరును వందకు చేర్చగా.. ఆ తర్వాత ఓవర్‌లోనే 6,4తో 37 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక ఉడ్‌ వేసిన 18వ ఓవర్‌లోనైతే వరుసగా 6,6,4తో 17 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్‌లో పాండ్యా 6, కోహ్లీ 4తో 11 పరుగులు జత చేరాయి. ఆఖరి ఓవర్‌లోనూ 16 పరుగులు రాగా  చివరి బంతికి ఆర్చర్‌ సూపర్‌ క్యాచ్‌తో పాండ్యా వెనుదిరిగాడు. అప్పటికే ఆఖరి 30 బంతుల్లో భారత్‌ 69 పరుగులు సాధించగా ఇందులో కోహ్లీవే 49 ఉండడం విశేషం.



స్కోరు బోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) ఆర్చర్‌ (బి) ఉడ్‌ 15; రాహుల్‌ (బి) ఉడ్‌ 0; ఇషాన్‌ (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 4; కోహ్లీ (నాటౌట్‌) 77; పంత్‌ (రనౌట్‌) 25; శ్రేయాస్‌ (సి) మలాన్‌ (బి) ఉడ్‌ 9; పాండ్యా (సి) ఆర్చర్‌  (బి) జోర్డాన్‌ 17; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 156/6. వికెట్ల పతనం: 1-7, 2-13, 3-24, 4-64, 5-86, 6-156. బౌలింగ్‌: రషీద్‌ 4-0-26-0; ఆర్చర్‌ 4-0-32-0; ఉడ్‌ 4-0-31-3; జోర్డాన్‌ 4-1-35-2; స్టోక్స్‌ 2-0-12-0; సామ్‌ కర్రాన్‌ 2-0-14-0.

ఇంగ్లండ్‌: రాయ్‌ (సి) రోహిత్‌ (బి) చాహల్‌ 9; బట్లర్‌ (నాటౌట్‌) 83; మలాన్‌ (స్టంప్‌) పంత్‌ (బి) సుందర్‌ 18; బెయిర్‌స్టో (నాటౌట్‌) 40; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 18.2 ఓవర్లలో 158/2. వికెట్ల పతనం: 1-23, 2-81. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-0; శార్దూల్‌ 3.2-0-36-0; చాహల్‌ 4-0-41-1; హార్దిక్‌ 3-0-22-0; సుందర్‌ 4-0-26-1.



ఇంగ్లండ్‌ తరఫున వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన తొలి ఆటగాడు మోర్గాన్‌.


ఇంగ్లండ్‌పై టీ20ల్లో కోహ్లీ(77 నాటౌట్‌)కిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 

 

టీ20ల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (70) అందించిన భారత జోడీగా కోహ్లీ-పాండ్యా.


2

టీ20 చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ రన్స్‌ (17 బంతుల్లో 49) చేసిన రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 


3

టీ20 పవర్‌ప్లేలో  అత్యల్ప స్కోరు (24/3) నమోదు చేయడం భారత్‌కిది మూడోసారి.


తన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో రాహుల్‌ స్కోర్ల (0,1,0,0)లో మూడు డకౌట్‌లు ఉండడం గమనార్హం.


Updated Date - 2021-03-17T09:31:37+05:30 IST