రేపటి నుంచి ప్రారంభం!
ABN , First Publish Date - 2021-11-30T13:39:28+05:30 IST
రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సుల మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించడానికి ఉన్నత విద్య మండలి అనుమతిని జారీ చేసింది. బుధవారం నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కోర్సుల..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సుల మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించడానికి ఉన్నత విద్య మండలి అనుమతిని జారీ చేసింది. బుధవారం నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కోర్సుల అడ్మిషన్లు ఇప్పుడిప్పుడే పూర్తవుతున్న విషయం తెలిసిందే. డిగ్రీకి సంబంధించి దోస్త్ ద్వారా అడ్మిషన్లను పూర్తి చేశారు. అలాగే ఇంజనీరింగ్, బి కేటగిరీ అడ్మిషన్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఆయా యూనివర్సిటీలు, కళాశాలల తరగతుల ప్రారంభానికి అనుమతిని ఇచ్చింది.
ఇక.. కరోనా మూడో దశ (ఒమిక్రాన్) తీవ్రత పెరుగుతుందన్న ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి అధికారులు మంగళవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు వర్సిటీలకు చెందిన వీసీలు, అధికారులు పాల్గొననున్నారు. కరోనా మరింతగా పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యాసంవత్సరం కొనసాగింపులపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంగళవారం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.