ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్టు, రిమాండ్

ABN , First Publish Date - 2020-08-31T22:26:29+05:30 IST

ఈశాన్య ఢిల్లీలో గత ఫిబ్రవరిలో చెలరేగిన జరిగిన హింసాకాండకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో..

ఢిల్లీ అల్లర్ల కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్టు, రిమాండ్

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో గత ఫిబ్రవరిలో చెలరేగిన జరిగిన హింసాకాండకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తాహిర్ హుస్సేన్‌‌ను (ఆప్ నుంచి సస్పెండైన కౌన్సిలర్) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది. తాహిర్ హుస్సేన్‌కు ఆరు రోజుల రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.


కాగా, ఈడీ అధికారుల సమాచారం ప్రకారం, తాహిర్‌ను తీహార్ జైలు నుంచి సౌత్ ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ ఏరియాలో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం అధికారులు తీసుకు వెళ్లి ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరెవరి దగ్గర నుంచి నిధులు వసూలు చేశారన్న విషయంతో పాటు ఆయనతో టచ్‌లో ఉన్న హవాలా ఆపరేటర్లు గురించి, తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌తో అతనికి ఉన్న సంబంధాలను కూడా ఈడీ ఆరాతీసింది.


ఢిల్లీ అల్లర్లకు సంబంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద తాహిర్‌పై కేసు నమోదైంది. అల్లర్ల సమయంలో ఐడీ అధికారికి అంకిత్ శర్మ హత్యకు సంబంధించిన ఆరోపణలపై కూడా తాహిర్‌ను అరెస్టు చేశారు. కాగా, ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌టీఎఫ్) విచారణలో సైతం ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో తన ప్రమేయం ఉందని తాహిర్ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి హిందువులకు గుణపాఠం చెప్పాలని తాను అనుకున్నట్టు విచారణలో తాహిర్ వెల్లడించాడని అంటున్నారు. ఢిల్లీ అల్లర్ల ప్రధాన సూత్రధారిగా తాను వ్యవహరించినట్టు కూడా తాహిర్ అంగీకరించినట్టు తెలుస్తోంది.


గత ఫిబ్రవరి 24న పౌరసత్వ చట్టం మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య చెలరేగిన హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మంది గాయపడ్డారు.

Updated Date - 2020-08-31T22:26:29+05:30 IST