రెండుసార్లు నాపై Encounter పన్నాగాలు: చింతమనేని
ABN , First Publish Date - 2022-05-27T00:52:06+05:30 IST
నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది.
ఏలూరు: ‘‘నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది. టీడీపీ, పార్టీ నాయకులు స్పందించకుంటే ఎపుడో చనిపోయేవాడ్ని. నా అడ్వొకేట్ శ్రీనివాసబాబుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నాకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. సీఎం జగన్తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్, నవ్జ్యోత్ సింగ్ గ్రేవాల్తోపాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని న్యాయస్థానం శిక్షించాలి’’ అంటూ ఏలూరు మొబైల్ కోర్టులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రైవేట్ కేసు దాఖలు చేశారు.
తన ప్రాణాలకు హాని ఉందని పేర్కొంటూ ఆయన ఏలూరులోని ఫస్ట్ క్లాస్ మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కేసును గురువారం ఉదయం దాఖలు చేశారు. కేసును స్వీకరించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులను త్వరలో వెల్లడిస్తుందని సీనియర్ న్యాయవాది శ్రీనివాసబాబు వివరించారు. ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తనపై 2019లో ఒకసారి, 2021లో మరోసారి ఎన్కౌంటర్కు ప్రయత్నించిందని, అందుకు ప్రత్యక్ష సాక్షుల ఆధారాలను న్యాయస్థానానికి సమర్పిస్తున్నానని చింతమనేని చెప్పారు.