నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-10-23T10:44:00+05:30 IST
: బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 23 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ ..
కర్నూలు, నంద్యాల్లో హెల్ప్లైన్ సెంటర్లు
కర్నూలు(ఎడ్యుకేషన్), అక్టోబరు 22: బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 23 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ జరుగుతుందని బి.తాండ్రపాడు ఎస్జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎఫ్ఏసీ ఎన్.కిషోర్ కుమార్ గురువారం తెలిపారు. ఈ శుక్రవారం నుంచి 27వ తేదీ వరకు ఎంసెట్ వెబ్సైట్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. లేనిచో నంద్యాల, కర్నూలులోని హెల్ప్లైన్ సెంటర్లను సంప్రదించి ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలన్నారు.
దీనికి ఏపీ ఎంసెట్-2020 హాల్టికెట్, ర్యాంకు కార్డు, ఇంటర్ లేదా సమానమైన మార్క్స్ మెమో, పదో తరగతి లేదా సమానమైన మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 1.1.2017కు తర్వాత రేషన్కార్డు, లోకల్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, ఒరిజినల్స్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని వెళ్లాలన్నారు. కర్నూలు జిల్లా ఎస్టీ అభ్యర్థులు తాండ్రపాడు ఎస్జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్కు వెళ్లాలని అన్నారు. నమోదు రుసుం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200 ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు.
స్పెషల్ కేటగిరి (ఎన్సీసీ/పీహెచ్/క్యాప్/స్పోర్ట్స్)లకు సంబంధించిన వారికి షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్ బెంజ్ సర్కిల్ విజయవాడలోనే కాకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, ఎస్వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిల్లో కూడా జరుగుతుందన్నారు. ఈ నెల 23వ తేదీన 1 నుంచి 20,000 ర్యాంకు వరకు 24న 20,001 నుంచి 50,000 వరకు, 25న 50,001 నుంచి 80,000 ర్యాంకు వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు 27న 1,10,001 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని అన్నారు.