పీఆర్సీపై ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-01-20T05:16:22+05:30 IST
పీఆర్సీపై ఉద్యోగుల నిరసన
గరివిడి : రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట గ్రామ కార్యదర్శులు బుధవారం నిరసన తెలిపారు. ఈ పీఆర్సీ వల్ల నష్టమే తప్ప, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కార్యక్ర మంలో కార్యదర్శ సంఘ నాయకులు కె.బాల కృష్ణ, కె.అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో...
బాడంగి : మండల కేంద్రంలో ఫ్యాప్టో జిల్లా నాయకులు బి.రాము ఆధ్వర్యంలో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు జీవితాంతం నష్టపోవాల్సిందేనని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మెయిన్ రోడ్డుపై మానవహారం నిర్వ హించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గురువారం జరగనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తహ సీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- బొబ్బిలిరూరల్ : పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంబద్ధమైన జీఓలను అర్ధరాత్రి విడుదల చేసిందని, దీనిపై తామూ పోరాడుతామని రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాఽధ్యక్షుడు రౌతు రామ్మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ 11వ పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు కూడా తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. జీవోలకు వ్యతిరేకంగా జేఏసీలతో కలిసి పోరుకు సన్నద్ధం కావాలని పిలు పునిచ్చారు. జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి చుక్క మహందాత, చుక్క శ్రీరామ్మూర్తి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- శృంగవరపుకోట : జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న ఽప్యాప్టో ధర్నా కార్యక్రమ విజయవంతానికి బుధవారం శృంగవరపుకోట ఏపీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు సమావేశమయ్యారు. జిల్లా జేఏసీ చైర్మన్ జె.మురళి, మండల జేఏసీ చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు.
ఉద్యమానికి సిద్ధం కావాలి
శృంగవరపుకోట రూరల్: పీఆర్సీని వ్యతిరేకిస్తూ నిర్వహించే నిరసన కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సిద్ధం కావాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కోరాయి. మండలంలోని ధర్మవరం, వెంకటరమణపేట, తిమిడి, వీరనారాయణంలో వివిధ ఉపాధ్యాయసంఘాలు ధర్నాను విజయవంతం చేయాలని కోరాయి.
ఎన్టీఆర్ విగ్రహం వద్ద ...
పార్వతీపురం రూరల్ : రివర్స్ పీఆర్సీ జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులను, విశ్రాంతి ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నట్టేట ముంచారని, ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆరోపించారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండలంలోని కృష్ణపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల బట్టలు ధరించి ఉద్యోగులకు మద్దతుగా నిరసన చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 43 శాతం పీఆర్సీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కూనపురెడ్డి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.