సమ్మెకు వెళ్లాలా? వద్దా?.. తర్జన భర్జనలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు

ABN , First Publish Date - 2022-01-31T19:07:13+05:30 IST

వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలన్న

సమ్మెకు వెళ్లాలా? వద్దా?..  తర్జన భర్జనలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు

అమరావతి: వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం నేతలు భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చించారు. అయితే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలా? వద్దా? అని వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం నేతలు తర్జన భర్జనలో పడ్డారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఓ ఎత్తైతే..   వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం మరో ఎత్తవుతుందని ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర సేవలకు విఘాతం కలిగితే తమనే ప్రధాన దోషిగా నిలబెడతారని వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు అంటున్నారు. సమ్మెకు వెళ్లకుండా దశలవారీ ప్రణాళికను రూపొందించుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఎస్మాను ముందుగా వైద్యారోగ్య శాఖ మీదే ప్రయోగిస్తారని ప్రతినిధులు స్పష్టం చేశారు.  


పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు సమర శంఖం పూరించాయి. వచ్చేనెల 7నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 24న సీఎస్‌ సమీర్‌ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (ఫిబ్రవరి-7) సమ్మెలోకి వెళ్లనున్నట్లు నోటీసులో హెచ్చరించనున్నట్టు చెప్పారు.


మరోవైపు ‘ఎస్మా చట్టానికి భయపడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతాం. చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే మేము నాలుగు అడుగులు వేస్తాం. చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటికి ముందు సమాధానం చెప్పాలి. మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చెయ్యొద్దు. జీతాల్లో కోత పెట్టొద్దు’ అని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

Updated Date - 2022-01-31T19:07:13+05:30 IST