ఉద్యోగులు మేల్కొనాలి

ABN , First Publish Date - 2022-01-29T05:09:57+05:30 IST

ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కొనాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు.

ఉద్యోగులు మేల్కొనాలి

  1. మాజీ మంత్రి అఖిలప్రియ


ఆళ్లగడ్డ, జనవరి 28: ఉద్యోగులు ఇప్పటికైనా మేల్కొనాలని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ అర్థరాత్రి వదిలిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాలను సీఎం జగన్‌ తెచ్చారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను చంద్రబాబునాయుడు ఇలా రోడ్డుపైకి తేలేదని గుర్తు చేశారు.  ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే తమకు న్యాయం జరుగుతుందో ఉద్యోగులు ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికార వైసీపీ మాదిరిగా రివర్స్‌ పీఆర్సీ చేయలేదన్నారు. ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను రహదారుల సమస్య వేధిస్తోందని, విద్యుత్‌ చార్జీల పెంపుదల, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న, వరి పంటల దిగుబడులకు నేటికీ డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపు తర్వాతే జిల్లాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ అప్పటికప్పుడు  జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టడం ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చడమేనన్నారు. జిల్లాల ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పినప్పటికీ ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు, ఉద్యోగులు ఒక్కసారి అవకాశమివ్వండంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.



Updated Date - 2022-01-29T05:09:57+05:30 IST