డీఆర్డీఏలో ఉద్యోగుల సర్దుబాటు
ABN , First Publish Date - 2020-09-27T16:19:43+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)లో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది...
భూపాలపల్లిలో భారీగా సిబ్బంది కుదింపు
ములుగు డీఆర్డీఏకు కేటాయింపు
మిగతా జిల్లాలో యథాతథం
హన్మకొండ, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)లో ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఈ మేరకు మూడు రోజుల కిందట జీవో 95ను విడుదల చేసింది. దీని ప్రకారం భూపాలపల్లి జిల్లా డీఆర్డీఏలో పనిచేస్తున్న 17మంది ఉద్యోగుల్లో 12మందిని ములుగు డీఆర్డీఏకు బదలాయించింది.
భూపాలపల్లిలో 1 ఏపీవో (డీఆర్డీఏ) 2 జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, 1 అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్, 1 సీడీ-డీఎల్ఆర్సీ/ఏపీడీ-సీబీ, 1 సీనియర్ క్వాలిటీకంట్రోల్ ఆఫీసర్ (డ్వామా) 1 క్యాంప్ ప్రోగ్రాం-ఎంఐఎ్సఎస్ అనలిస్టు (ఈజీఎస్ ఎఫ్టీఈ, 1 డిస్ట్రిక్ట్ డిసబులిటీ కోఆర్డినేటర్ (డ్వామా) 1 సీనియర్ అకౌంటెంట్(డీఆర్డీఏ)/సీబీవో ఆడిటర్) ఒక జూనియర్ అకౌంటెంట్ (డీఆర్డీఏ) 1 టైపిస్టు కమ్ అసిస్టెంట్ (డ్వామా) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, 1 డ్రైవర్, 1 ఆఫీసు సబార్డినేట్ (డ్వామా), 2 ఆఫీసు సబార్డినేట్లు (డీఆర్డీఏ)లు ఉన్నారు. వీరిలో ఐదుగురిని ఉంచి మిగతా 12 పోస్టులను ములుగు డీఆర్డీఏకు మార్చారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లిలో 1 డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్, 1 సీనియర్ అకౌంటెంట్ (డీఆర్డీఏ)/ సీబీవో ఆడిటర్, 1 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, 2 ఆఫీసు సబార్డినేట్లను ఉంచారు. భూపాలపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను కుదించడం వెనుక గల కారణం తెలియరాలేదు. మిగతా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్ డీఆర్డీఏ కార్యాలయాల సిబ్బందిని మాత్రం ప్రభుత్వం ముట్టుకోలేదు. కొత్త జీవో ప్రకారం డీఆర్డీఏలో 12 మంది ఉంటే సరిపోతుంది. మిగతా జిల్లాల ఉద్యోగులను సవరించకపోవడాన్ని పరిశీలిస్తే భూపాలపల్లి జిల్లా డీఆర్డీఏలో ఖాళీల భర్తీకి కొత్తగా నియామకాలు చేపట్టవచ్చని తెలుస్తోంది.
ఉద్యోగుల కుదింపు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డీఆర్డీఏ శాఖలో మొత్తం 83 మంది ఉన్నారు. మొదట ఐదు జిల్లాలుగా విభజించిన తర్వాత ఈ సిబ్బందిని ఆయా జిల్లాలకు కేటాయించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 17మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 21, మహబూబాబాద్ జిల్లాలో 14 మంది, జనగామ జిల్లాలో 14 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 మందిని కేటాయించింది. ఆ తర్వాత ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారు.
అయితే ములుగు జిల్లాగా ఏర్పడినా ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన, నియామకాలు జరగలేదు. ఇప్పటికీ పలు కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందులో ఒకటి. కీలకమైన శాఖకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లేడు. జిల్లా పరిషత్ సీఈవో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.