నిరసన
ABN , First Publish Date - 2021-12-08T05:47:26+05:30 IST
పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు విడుదల, సీపీఎస్ రద్దు తదితర సమస్యలపై ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు.
పీఆర్సీ అమలుకు ఉద్యోగుల పట్టు
పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు విడుదల, సీపీఎస్ రద్దు తదితర సమస్యలపై ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మునిసిపల్, వైద్య, ఉపాధ్యాయ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిడదవోలు, డిసెంబరు 7 : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ జేఏసీ నిడదవోలు తాలూకా యూనిట్ అధ్యక్షుడు కె.నందీశ్వరుడు డిమాండ్ చేశారు. నిడదవోలులోని నీటి పారుదల శాఖ కార్యా లయం వద్ద భోజన విరామం సమయంలో నిరసన ఽప్రదర్శన నిర్వ హించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను తక్షణం పరిష్కరించా లన్నారు. కార్యదర్శి జె.జయంత్, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
తణుకు: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం న్యాయమైందని, సీఐటీయూ వారికి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అనంతరం కమిషనర్ వాసు బాబుకు వినతి పత్రం ఇచ్చారు. యూనియన్ అధ్యక్షుడు కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరిగిన నిరసనలో తణుకు జేఏసీ చైర్మన్ నరసరాజు, కన్వీనర్ సత్యనారాయణ, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇరగవరం: ఇరగవరం పీహెచ్సీలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులు డాక్టర్ వి.లక్ష్మి, సూపరింటెండెంట్ ప్రసాద్, పిహెచ్ఎన్ జయామణి, సిహెచ్ఓ బి.వి.ఎస్.రాజు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
గణపవరం: రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి హెచ్ఎస్వీవీ ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం పిప్పర జడ్పీ హైస్కూల్ ఎదుట ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడు నాని, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మున్సిపల్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. మున్సిపల్ మేనేజర్ ఎం.దివ్యకుమారి, ఏఎస్వో కె.సురేష్, అకౌంటెంట్ ఎస్.రాంబాబు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
పెంటపాడు: అలంపురం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద యూటీఎఫ్ నాయకులు ఏవీ రామరాజు, కనకారావు, నాగేంద్ర, ఏపీఎన్జీవో తాడేపల్లిగూడెం తాలూకా ఉపాధ్యక్షుడు ఎం.యజ్ఙ సంతోషరావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.