పోస్టర్లను ఆవిష్కరిస్తున్న తెలుగుగంగ ప్రాజెక్టు టైంస్కేల్ ఉద్యోగులు
శ్రీకాళహస్తి, జనవరి 19: పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మినిమం టైంస్కేల్, పార్ట్టైం ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలుగుగంగ ప్రాజెక్టు మినిమం టైంస్కేల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తెలుగుగంగ కాలనీలో ఆ సంఘ ప్రతినిధులు సమస్యలపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32ఏళ్లుగా టైంస్కేల్, పార్ట్టైం ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో కొందరు మరణించగా, పలువురు ఉద్యోగ విరమణ చేశారన్నారు. అయితే శాశ్వత ఉద్యోగులు కాకపోవడంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు చంద్రశేఖర్, రవికుమార్, శేఖర్, కృష్ణ, వాసుదేవుడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.