UAE: భారత్ సహా 11 దేశాల ట్రాన్సిట్ విమానాలకు ఎమిరేట్స్ గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2021-08-04T13:32:51+05:30 IST

భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

UAE: భారత్ సహా 11 దేశాల ట్రాన్సిట్ విమానాలకు ఎమిరేట్స్ గ్రీన్ సిగ్నల్!

అబుధాబి: భారత్‌తో పాటు మరో పది దేశాల ట్రాన్సిట్ విమానాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కీలక ప్రకటన చేసింది. కరోనా వల్ల ఆయా దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులు ఈ విమానాల ద్వారా తిరిగి యూఏఈ రావొచ్చని పేర్కొంది. అయితే, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే యూఏఈలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసింది. గురువారం నుంచి అర్హత ఉన్న ప్రయాణికులు యూఏఈలో ప్రవేశానికి అనుమతించబడతారని ఎమిరేట్స్ తెలిపింది. అలాగే జర్నీకి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న ప్రయాణికులు కూడా యూఏఈ వెళ్లొచ్చు. కానీ, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. ఇక ఈ నిర్ణయంతో భారత్ నుంచి వచ్చే విమానాలకు యూఏఈలో పాక్షికంగా అనుమతి లభించినట్లు అయింది. 


భారత ప్రయాణికులకు గురువారం నుంచి తమ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌కు అనుమతులు ఉంటాయని ఎమిరేట్స్ స్పష్టం చేసింది. ఇలా ట్రాన్సిట్ అనుమతులు పొందిన దేశాల జాబితాలో భారత్‌ సహా 11 దేశాలు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, ఉగాండా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, నేపాల్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక ప్రధాన రంగాలకు చెందిన టీకాలు తీసుకున్నవారితో పాటు తీసుకోని ప్రయాణికులకు కూడా యూఏఈలో ప్రవేశానికి అనుమతి ఉంటుందని మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించింది. యూఏఈలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్స్(వైద్యులు, నర్సులు, టెక్నిషీయన్స్), టీచింగ్ స్టాఫ్(యూనివర్శిటీ, కళాశాల, పాఠశాల, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు) యూఏఈ తిరిగి రావొచ్చని ఎన్‌సీఈఎంఏ స్పష్టం చేసింది.     

Updated Date - 2021-08-04T13:32:51+05:30 IST