Eluru Dist.: అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-20T21:57:04+05:30 IST

శ్రీధర వేలూరులో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Eluru Dist.: అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితుల ఆగ్రహం

ఏలూరు జిల్లా (Eluru Dist.): కుక్కునూరు మండలం, శ్రీధర వేలూరులో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితులు (Flood victims) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ (AP), తెలంగాణ (Telangana) సరిహద్దులో ఉన్న ఈ గ్రామం గోదావరి (Godavari) వరదలో చిక్కుకుంది. వరద బాధితుల సమీపంలోని గుట్టపై బాధితులు తలదాచుకుంటున్నారు. ఐదు రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ ఇటువైపు రాలేదని, తమను పట్టించుకోవడమే మానేశారని మండిపడ్డారు.


గోదావరి వరదకు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని గ్రామాలు కకావికలమయ్యాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన గ్రామాలు నేడు బురదతో నిండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు గోదావరి మహోగ్రరూపానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా నీట మునిగిన ఇళ్లు ఇప్పుడిప్పుడే బయల్పడుతున్నాయి. వారం రోజులుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులు ఇళ్లకు వెళ్తున్నారు. అయితే, తమ ఇళ్లు నేలకొరిగిపోయి ఉండడం, గోడలు దెబ్బతినడం, బురద పేరుకు పోవడం వంటి దృశ్యాలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇళ్ల లోపల, బయట బురదమయంగా మారింది. పూరిళ్లు రూపురేఖలు కోల్పోయాయి. తలుపులు, ఇంట్లో ఉంచిన సామాగ్రి సైతం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. విద్యుత్‌ తీగలు ఎక్కడకక్కడ తెగిపడ్డాయి. గ్రామాల్లో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. మళ్లీ ఎప్పటికి తేరుకుంటామోనని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - 2022-07-20T21:57:04+05:30 IST