కౌంటింగ్కు భారీ భద్రత
ABN , First Publish Date - 2021-07-24T06:05:54+05:30 IST
ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపే ఏలూరు కార్పొరేషన్ పాలక మండలి ఓట్ల లెక్కింపు
150 మందితో భారీ భద్రత
నగరంలో 144 సెక్షన్ అమలు
కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రాహుల్, జేసీ వెంకట రమణారెడ్డి
కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు
ఏలూరు/క్రైం/ టూ టౌన్(ఆంధ్రజ్యోతి), జూలై 23 : ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి ఓట్ల లెక్కింపునకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 25న జరిగే కౌంటింగ్కు కావాల్సిన సామగ్రిని కార్పొరేషన్ అధికా రులు సిద్ధం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరుకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు హాళ్లను రెండు నుంచి నాలుగుకు పెంచారు. మొత్తం 47 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి కౌంటింగ్ హాలులో రెండు నుంచి 20వ డివిజన్ వరకు, రెండో హాలులో 21 నుంచి 31వ డివిజన్ వరకు, మూడో హాలులో 33 నుంచి 44వ డివిజన్ వరకు, నాలుగో హాలులో 45 నుంచి 50వ డివిజన్ వరకు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల తీరును శుక్రవారం జేసీ వెంకటరమణారెడ్డి పరిశీలించారు. విద్యుత్ లైటింగ్, కౌంటింగ్ బల్లలు, బారికేడ్లు, మైక్ సిస్టం, సీసీ కెమేరాల ఏర్పాటు పనులన్నీ త్వరితగతిన పూర్తి కావాలని సిబ్బందిని ఆదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాలులో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ రోజున అభ్యర్థులకు, కౌం టింగ్ సిబ్బందికి తాగునీరు, మాస్క్లు, శానిటైజర్లు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధ నలు పాటించాలన్నారు. జేసీ వెంట ఆర్డీవో రచన, ఇతర అధికారులు పాల్గొన్నారు. '
150 మందితో బందోబస్తు : డీఎస్పీ
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్ర శాంతంగా నిర్వహించడానికి 150 మంది పోలీసు అధి కారులు, సిబ్బందిని నియమించినట్లు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్కిరణ్ చెప్పారు. బందోబస్తు నిర్వహణపై శుక్ర వారం పోలీసు అధికారులకు డీఎస్పీ అవగాహన కల్పించారు. 144 అమలులో వున్న దృష్ట్యా ఎవరు గుమిగూడినా, కలిసి తిరిగినా చర్యలు తీసుకోవాలి. పాస్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమ తించాలి. విధులు నిర్వర్తించే సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తాం. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, ఎస్ఐలు, 131 మం ది పోలీస్ సిబ్బందిని వినియోగి స్తున్నాం. కొవిడ్ నిబంధనలు అతిక్ర మించినా, మాస్క్లు లేకున్నా కేసు లు నమోదు చేస్తాం. ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమ తులు లేవు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని డీఎస్పీ తెలిపారు.
కేంద్రంలోకి ఫోన్లు నిషేధం
కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ చెప్పారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కేంద్రంలోకి ఏజెంట్లు, అభ్యర్థులు ఒక మార్గంలోను, అధికారులు మరో దారిలోను వచ్చే విధంగా చర్యలు తీసుకున్నా మన్నారు. ఏజెంట్లు, అభ్యర్థులు సెల్ ఫోన్లు తీసుకురాకూడదని వారిని తనిఖీ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు.
నగరంలో దారి మళ్లింపు
కౌంటింగ్ సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి ఏలూరు నగరంలో దారి మళ్లించనున్నారు. పెదపాడు బ్రిడ్జి నుంచి మినీ బైపాస్ రోడ్డులో కలపర్రు టోల్గేటు వైపు వెళ్ళేవారు మార్గమధ్యలో గ్రీన్ సిటీ ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి సత్రంపాడు మీదుగా వట్లూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి వెళ్లాలి. శౌరీపురం నుంచి మినీ బైపాస్ రోడ్డులో వెళ్లడానికి అనుమతి లేదు. వారు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సత్రంపాడు మీదుగా ఏలూరు వైపు రావాలి. వట్లూరు నుంచి సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలి.