తెలుగు సాహిత్యం- రైతాంగ సమస్యలు

ABN , First Publish Date - 2021-03-03T06:09:49+05:30 IST

1910లో ఏర్పడిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇప్పటి వరకూ అయిదు వార్షిక సదస్సులు, అయిదు మహాసభలు జరుపుకుంది...

తెలుగు సాహిత్యం- రైతాంగ సమస్యలు

సదస్సు : 

1910లో ఏర్పడిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఇప్పటి వరకూ అయిదు వార్షిక సదస్సులు, అయిదు మహాసభలు జరుపుకుంది. రెండవ దశాబ్దంలోకి అడుగుపెడుతూ ఆరవ వార్షిక సదస్సును జరుపుకోవటానికి సిద్ధం అవుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి రెండవ వారంలో మహబూబ్ నగర్‌లో మహాసభ జరుపుకొన్న తర్వాత నుంచీ ఆర్నెల్లపాటు మరే భౌతిక ఆచరణకూ వీలులేని విధంగా కరోనా విపత్తు వచ్చి సృష్టించిన సంక్షోభం మనందరి అనుభవమే.


వ్యవసాయ ప్రవేటీకరణను వ్యవస్థీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు కలిగిస్తున్న ఆందోళన దీనికి తోడయింది. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సదుపాయ కల్పన) బిల్లు 2020, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు 2020 , నిత్యావసర సరకుల సవరణ బిల్లులు – లోక్‍సభలో ఆమోదం పొందాక రైతుల పోరాటం మొదలైంది. ఈ చట్టాలు రైతులను సాధికారులను చేస్తాయని ప్రభుత్వం అంటున్నది. కానీ అసమానతలు ఉన్న సమాజంలో స్వేచ్ఛ ఏ వర్గాలకి అమలవుతుందో స్పష్టమే. కనుకనే లక్షలకొద్దీ రైతాంగం మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమం చేస్తూ ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకొన్నారు. 


ఈ సందర్భంలో రచయితలు కళాకారులు కూడా వాళ్ల వైపే నిలబడవలసి వున్నది అని నమ్ముతున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆరవ వార్షిక సదస్సును రైతాంగ సమస్య మీద కేంద్రీకరించాలని అనుకొన్నది. ‘తెలుగు సాహిత్యం - రైతాంగ సమస్యలు’ అంశంపై వార్షిక సదస్సును మార్చ్ 7, 8 తేదీలలో వరంగల్‌లో నిర్వహిస్తున్నది. 


విత్తనం, ఎరువులు, అప్పులు - మొదలైన రూపాలలో రైతాంగం మార్కెట్ కబంధ హస్తాలలో గిలగిలలాడుతున్నకాలంలో వ్యవసాయ రంగం నుంచి తమ జవాబుదారీతనాన్ని తీసివేయడానికి, రైతు జీవితానికి ఏ విధమైన భరోసాను మిగల్చని ఈ నూతన వ్యవసాయచట్టాలను కేంద్రప్రభుత్వం తెచ్చింది. వ్యవసాయ విధానంలో మన ప్రయాణం ఏమిటో, ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చామో, గమ్యం ఏమిటో తెలుసుకోవడం అవసరం. అందుకు తగినట్లుగా ఈ సదస్సులోని అంశాలను రూపొందించాం.


1947 నుంచి 1965 మధ్యకాలపు దశను, 1966 నుంచి 1990 వరకు హరిత విప్లవ పరిణామాల దశను, 1991 నుంచి ఇప్పటివరకు నూతన ఆర్థిక సంస్కరణల పరిణామ దశను విడివిడిగా చర్చించాలి. ఆయా దశలలోని మానవ జీవిత సంఘర్షణలను, ప్రత్యేకించి రైతాంగ మహిళ సంవేదనను, సంసిద్ధతను తెలుగు సాహిత్యం ఏ మేరకు ప్రతిఫలించిందో అంచనా వేయటం లక్ష్యంగా ఈ సదస్సు సమావేశాలనుఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రకారులు, వ్యవసాయ రంగ సమస్యల మీద పని చేస్తున్నకార్యకర్తలు, తెలుగు సాహిత్యాన్ని సామాజిక సంబంధంలో అధ్యయనం చేసే విశ్లేషకులు పాల్గొని ప్రసంగించే ఈ సదస్సుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

Updated Date - 2021-03-03T06:09:49+05:30 IST