గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ కిందపడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-07-09T12:41:41+05:30 IST

గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన టేక్మాల్‌ మండలంలోని ఎల్లుపేటలో ..

గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ కిందపడి ఒకరి మృతి

టేక్మాల్‌, జూలై 8: గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన టేక్మాల్‌ మండలంలోని ఎల్లుపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కేటగిరి శేఖర్‌గౌడ్‌ (40) హోటల్‌  నిర్వహిస్తున్నాడు. రోజూ ఉదయం హోటల్‌లోని చెత్తను తీసుకువెళ్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌లో వేస్తుంటాడు. ఇదే క్రమంలో బుధవారం కూడా చెత్తను తీసుకువచ్చిన శేఖర్‌గౌడ్‌ ట్రాక్టర్‌ వెనకాల ఉండి అందులో చెత్తను వేస్తున్నాడు. కాగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ పోతరాజు నరేందర్‌ నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను వెనక్కి తీయగా శేఖర్‌గౌడ్‌ నడుము మీద నుంచి ట్రాక్టర్‌ టైరు వెళ్లింది. గ్రామస్థులు అతన్ని వెంటనే ఆటోలో మెదక్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు శేఖర్‌గౌడ్‌ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు ప్రశాంత్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు టేక్మాల్‌ ఎస్‌ఐ లింబాద్రి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-09T12:41:41+05:30 IST