కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2022-07-06T17:15:44+05:30 IST
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం కమనీయంగా జరిగింది. తిలకించేందుకు వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా
కనులపండువగా ఎల్లమ్మ కల్యాణం
హైదరాబాద్/అమీర్పేట: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం కమనీయంగా జరిగింది. తిలకించేందుకు వచ్చిన భక్తులతో బల్కంపేట జనసంద్రంగా మారింది. ఉదయం 11.45 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్ దంపతులు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ కవిత, టీఎ్సఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు కేతినేని సరళ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణగౌడ్, ఈవో అన్నపూర్ణ తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు ఐదున్నర లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అర్ధరాత్రి దాటినా, వర్షం కురుస్తున్నా దర్శనం కోసం క్యూలో వేచి ఉన్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల దర్శనానికి వెళ్లేవారికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు క్యూలో వేచి ఉన్న భక్తులకు పులిహోర, మంచినీటి ప్యాకెట్లు అందజేశారు.