పోటీ పరీక్షలపై భయాలను తొలగించుకోవాలి
ABN , First Publish Date - 2022-05-20T06:01:11+05:30 IST
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని పోటీ పరీక్షలపై భయాలను తొలగించుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు.
- ఎస్పీ రాహుల్హెగ్డే
సిరిసిల్ల ఎడ్యుకేషన్, మే 19: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండాలని పోటీ పరీక్షలపై భయాలను తొలగించుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గూప్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ తదితర పరీక్షలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిందని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పోటీ పరీక్షల్లో పేపర్ల గురించి, చదవాల్సిన పుస్తకాల గురించి అవగాహన కల్పించారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో సరైన అవగాహనతో ముందుకు వెళితేనే విజయం సాధించవచ్చన్నారు. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ ప్రతీ అభ్యర్థి నిరాశకు లోనుకాకుండా చదవాలని, గ్రంథాలయం తరుఫున ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామన్నారు. డీఈవో రాధాకిషన్ మాట్లాడుతూ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని సరైన ప్రణాళికతో చదివితేమీ లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వక్త పార్లపల్లి రాజు, సివిల్స్ మెంటర్, నా గమ్యం ఐఏఎస్ పుస్తక రచయిత నారోజు శంకరాచార్య, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సదానందం, గోపి, నవీన్, కిషోర్, శ్రీనివాస్, ప్రశాంత్, అపర్ణ ఫౌండేషన్ అధ్యక్షులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.