నాడు అర్హులు.. నేడు అనర్హులు..
ABN , First Publish Date - 2022-05-06T05:10:05+05:30 IST
ఎనిమిదేళ్ళుగా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను నేడు అధికారులు అనర్హులుగా పేర్కొంటూ పింఛన్లను రద్దు చేశారు. చేనేత పింఛన్లలో జరిగిన అవకతవకలను నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు పవర్లూమ్ కార్మికులను అనర్హులుగా పేర్కొంటూ పెన్షన్ ఇటీవల తొలగించారు. నాడు అర్హులుగా పెన్షన్ పొందిన వారు నేడు అనర్హులుగా మారారు. చేనేత పింఛన్లకు సంబంధించి నేత కార్మికుల్లో అయోమయం నెలకొంది.
దండేపల్లి మండలంలో 40 మంది పింఛన్ల రద్దు
హ్యాండ్లూమ్ విభాగం వారయితే సరి
పవర్లూమ్ కార్మికులకు మొండిచేయి
గుర్తింపు కార్డులున్నా అధికారులు ససేమిరా
అయోమయంలో నేత కార్మికులు
మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ళుగా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను నేడు అధికారులు అనర్హులుగా పేర్కొంటూ పింఛన్లను రద్దు చేశారు. చేనేత పింఛన్లలో జరిగిన అవకతవకలను నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు పవర్లూమ్ కార్మికులను అనర్హులుగా పేర్కొంటూ పెన్షన్ ఇటీవల తొలగించారు. నాడు అర్హులుగా పెన్షన్ పొందిన వారు నేడు అనర్హులుగా మారారు. చేనేత పింఛన్లకు సంబంధించి నేత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఎనిమిదేళ్ళుగా పొందుతున్న లబ్ధిదారులను అనర్హులుగా పేర్కొంటూ అధికారులు దండేపల్లి మండలంలో పింఛన్లను రద్దు చేశారు. పింఛన్లు పొందేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతూ నకిలీ పత్రాలతో పథకంలో చేరుతుండగా, అర్హులమైన తమకు ఎలా రద్దు చేస్తారంటూ అసలైన లబ్ధిదారులు కలెక్టర్ను కలిశారు.
దండేపల్లి మండలంలో 50 మంది నేత కార్మికులను పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. వీరందరికీ 2014 నుంచి నెలకు రూ. 2016 చొప్పున పెన్షన్ అందుతోంది. ముత్యంపేట గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఎలాంటి అర్హతలు లేకపోయినా పింఛన్లు పొందుతున్న విషయాన్ని జనవరి 21న ‘చేనేత పింఛన్లలో చేతివాటం’ శీర్షికన ’ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన కలెక్టర్ భారతి హోళికేరి విచారణకు ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేషాద్రి లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాల నిజ నిర్ధారణకు కరీంనగర్లోని హ్యాండ్లూమ్ ఏడీకి లేఖ రాశారు. విచారణ చేపట్టిన అధికారులు పింఛన్లు పొందుతున్న 50 మందిలో ఐదుగురు మాత్రమే అర్హులుగా గుర్తించారు. అనర్హులుగా తేలిన వారిలో నలుగురు ఇప్పటికే చనిపోగా ఒకరు వితంతు పింఛనుకు మారిపోయారు. దీంతో మిగిలిన 40 మంది లబ్ధిదారులను అనర్హులుగా పేర్కొంటూ పింఛన్లు రద్దు చేసిన జిల్లా అధికారులు ఇంతకాలం తీసుకున్న సొమ్మును చెల్లించాలని గత నెల 13న ఎంపీడీఓ మల్లేశం ద్వారా నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చేనేత విభాగంలో 287 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో చెన్నూరులోని చేనేత విభాగానికి సంబంధించి ఒక యూనిట్ ఉండగా దాని పరిధిలో 150 మంది కార్మికులు ఉన్నారు. పవర్లూమ్లకు సంబంధించి లక్షెట్టిపేట, మంచిర్యాలలో 10 యూనిట్లకు గాను మరో 137 కార్మికులకు చేనేత పింఛన్లు అందుతున్నాయి. దండేపల్లి మండలంలో అధికారులు చేపట్టిన చర్యల కారణంగా తమకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ విధానంతో అయోమయం...
దండేపల్లి మండలంలోని 45 మంది పింఛన్ల లబ్ధిదారులకు అవసరమైన గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీరిలో ఐదుగురు హ్యాండ్లూమ్ కార్మికులు కాగా, మిగతా 40 మంది పవర్లూమ్ కార్మికులు. 2014లో వారందరికీ గుర్తింపు కార్డులు కూడా జారీ అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చేనేత పింఛన్లు అని ప్రకటించడంతో దాన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు పవర్లూం కార్మికుల పింఛన్లను రద్దు చేశారు. 2014లో చేనేత పింఛన్లకు ఎంపిక చేసే సమయంలో లబ్ధిదారులు దరఖాస్తులకు వారి గుర్తింపు కార్డులు జత చేశారు. ఆ కార్డుల ఆధారంగా పవర్లూమ్ కార్మికులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత వాటిని రద్దు చేయడంపై వారు ఆందోళన చెందుతున్నారు. అనర్హులుగా నిర్ధారణ అయిన వారిపై చర్యలు తీసుకోవలసిన అధికారులు మండలంలోని మొత్తం చేనేత పింఛన్లను రద్దు చేయడంతో ఆయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని 40 మంది కార్మికులు ఇటీవల కలెక్టర్కు విన్నవించారు.
25 సంవత్సరాలు మగ్గం పని చేశా
ఎనగందుల మల్లేశ్, దండేపల్లి
1980 నుంచి 20 సంవత్సరాల పాటు మహారాష్ట్రలోని భీమండిలో మగ్గం పని చేశాను. అనంతరం మరో 5 సంవత్సరాలు సిరిసిల్లలో నేత పని చేశాను. రెండు చోట్లా పవర్లూమ్ పనులే చేశాను. చేనేత కార్మికునిగా అధికారులు నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారు. నేత పనిలో ఏ పని చేయడంలో ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడి ఉండటంతో ఇంటి పట్టునే ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పింఛన్పై ఆధారపడి జీవిస్తున్నాను. ఇప్పుడు పింఛను రద్దు చేశారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి.