పంటలపై గజ దాడులు

ABN , First Publish Date - 2022-05-27T07:37:12+05:30 IST

గంగవరం మండలం కల్లుపల్లె, కీలపట్ల అటవీప్రాంత సరిహద్దుల్లోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఏనుగుల గుంపులు విరుచుకు పడి విధ్వంసం సృష్టించాయి.

పంటలపై గజ దాడులు
ఏనుగుల దాడిలో ధ్వంసమైన టమోట తోట

గంగవరం, మే 26: గంగవరం మండలం కల్లుపల్లె, కీలపట్ల అటవీప్రాంత సరిహద్దుల్లోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఏనుగుల గుంపులు విరుచుకు పడి విధ్వంసం సృష్టించాయి. రెండు ఏనుగుల గుంపులు వేర్వేరుగా ఈ గ్రామాల్లోని పంట పొలాలకు చేరాయి. కల్లుపల్లె సమీపంలోని ఈశ్వరయ్యకు చెందిన టమోటా తోటలోకి నాలుగు ఏనుగులు ప్రవేశించాయి. కోత దశలో ఉన్న టమోటా పంటను, పశువుల గడ్డిని తిని, తొక్కి నాశనం చేశాయి. పొలాల్లో అమర్చిన డ్రిప్‌పైపులు, పైపులైన్లు, మోటార్లను ధ్వంసం చేశాయి. మరో 14 ఏనుగులు కీలపట్ల  సమీపంలోని పంటపొలాలను, మామిడి తోటలను ధ్వంసం చేశాయి. మామిడి తోటలో కాపలాదారులున్న గుడిసెను చుట్టుముట్టాయి. ఏనుగుల ఘీంకారాలను పసిగట్టిన గుడిసెలోని కూలీలు ఉలిక్కిపడి.. చాకచక్యంగా ఏనుగుల నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయారు. అయినప్పటికీ ఏనుగుల గుంపు వీరిని కొంతదూరం వెంబడించి భయబ్రాంతులకు గురిచేశాయి. కాపలాదారులున్న గుడిసెను పూర్తిగా తొక్కి నేలమట్టం చేసి కోపంతో రగిలిపోయాయి. మామిడి కాయలను తిని, కొమ్మలు విరిచి నాశనం చేశాయి. ఈ ఏనుగుల దాడుల్లో మూర్తి, సోమనాథ్‌, ముక్తార్‌ అనే రైతుల మామిడితోటలు ధ్వంసమయ్యాయి. పంటపొలాలపై దాడి చేస్తున్న ఏనుగులు.. గుడిసెలు, రైతులు కనిపిస్తే విరుచుకుపడుతున్నాయని స్థానికులు భయాందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు, పాలకులు స్పందించి ఏనుగులదాడుల నుంచి పంటలకు, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-05-27T07:37:12+05:30 IST