ఘీంకారాలతో హడలెత్తిన కోతిగుట్ట

ABN , First Publish Date - 2021-06-13T05:41:52+05:30 IST

పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ ప్రజలు శుక్రవారం రాత్రంతా ఏనుగుల ఘీంకారాలతో హడలెత్తిపోయారు.

ఘీంకారాలతో హడలెత్తిన కోతిగుట్ట
నిస్సహాయంగా నిలబడ్డ ఏనుగులగుంపు

చనిపోయిన ఏనుగు కోసం రాత్రంతా నిరీక్షణ

ఆగ్రహంతో రైతులపై తిరగబడ్డ ఏనుగులు

  

పలమనేరు రూరల్‌ :  పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామ ప్రజలు  శుక్రవారం రాత్రంతా ఏనుగుల ఘీంకారాలతో హడలెత్తిపోయారు. కోతిగుట్టలో కరెంట్‌ షాక్‌తో ఓ ఆడ ఏనుగు శుక్రవారం ఉదయం చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో శుక్రవారం పొద్దువాలగానే 15 ఏనుగుల గుంపు కోతిగుట్ట సమీపంలోని ఏనుగు మృతి చెందిన ప్రదేశం వద్దకు చేరుకుంది.ఘీంకారాలు చేస్తూ  గ్రామస్తులను ఏనుగులు హడలెత్తించాయి.మృతి చెందిన  ఏనుగు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆ ఏనుగును పాతిపెట్టిన ప్రదేశం సమీపంలోనే రాత్రంతా వుండిపోయాయి. శనివారం వేకువజామున  గ్రామంలోని రైతులందరూ అటవీశాఖ సిబ్బందితో కలసి ఏనుగుల మంద సమీపానికి చేరుకున్నారు.నిస్సహాయ స్థితిలో ఉన్న ఏనుగుల మందను చూసి చలించిపోయారు.తెల్లారిపోయినా ఏనుగులు కదలకపోవడంతో టపాకాయలు పేల్చుతూ శబ్దాలు చేస్తూ ఏనుగులను అడవిలోకి మళ్లించడానికి అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ పక్క మృత్యువాత పడ్డ ఏనుగు ఆచూకీ తెలియకపోవడం, మరోపక్క టపాకాయల చప్పుళ్లు ఏనుగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తిరగబడి తరుముకోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రైతులంతా పరుగులు తీశారు.శరవణ అనే రైతు చిక్కినట్టే చిక్కి క్షణాల్లో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. రవి అనే రైతు పొలంవైపు వెళ్తుండగా ఓ ఏనుగు తొండంతో బాదగా పక్కనున్న చెట్లపొదల్లో పడిపోయాడు.ఏనుగులకు చిక్కిన ఆ ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని గ్రామస్తులంతా భావించారు.ఏనుగుల గుంపు అడవిలోకి మళ్లిన వెంటనే వారి వద్దకు చేరుకొని పరిశీలించగా, గాయాలతో కనిపించారు.తీవ్రంగా గాయపడిన రవిని  పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఏనుగులు మళ్లీ వచ్చే అవకాశముంది కాబట్టి రైతులెవరూ రాత్రిపూట పొలాల వైపు వెళ్లరాదని ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసులు సూచించారు.ట్రాకర్లు, సిబ్బంది ఇక్కడే అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు.



Updated Date - 2021-06-13T05:41:52+05:30 IST