ఏప్రిల్ మాసంలోనూ ఓ ఆడ ఏనుగూ ఇలాగే మరణించిందా? వెల్లడించిన అధికారులు

ABN , First Publish Date - 2020-06-03T21:45:07+05:30 IST

కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. అచ్చు

ఏప్రిల్ మాసంలోనూ ఓ ఆడ ఏనుగూ ఇలాగే మరణించిందా? వెల్లడించిన అధికారులు

కేరళ : కేరళలోని మలప్పురం జిల్లాలో గర్భంతో ఉన్న ఏనుగును పైనాపిల్ బాంబుతో చంపిన విషయం తెలిసిందే. అచ్చు ఇలాంటి సంఘటనే కొల్లాంలో కూడా సంభవించిందా? అంటే అవుననే అంటున్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. యవ్వనంలో ఉన్న ఆడ ఏనుగును కూడా ఏప్రిల్ మాసంలో పైనాపిల్ బాంబుతోనే చంపేశారని వారు వెల్లడించారు.


‘‘ ఏప్రిల్ మాసంలో కూడా అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి సంభవించింది. కొల్లాంలో జిల్లాలోని పఠానాపురం అడవుల్లో ఓ యువ ఆడ ఏనుగు కూడా ఇలాగే మరణించింది’’ అని ఆయన ప్రకటించారు. అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఉన్న ఆ ఆడ ఏనుగును తాము పఠాన్‌పూర అడవుల్లో గత నెలలో గుర్తించామని అన్నారు. ఆ ఏనుగు మంద నుంచి తప్పిపోయి... గాయాలతో కనిపించిందని తెలిపారు.దాని దవడ విరిగిపోయిందని, ఆహారం తీసుకోలేక తీవ్ర అవస్థకు గురైందన్నారు.


‘‘అది చాలా బలహీనంగా కనిపించింది. అటవీ అధికారులు దగ్గరికి రాగానే... అడవిలోకి పరిగెత్తిపోయింది. ఏనుగుల మందలో చేరిపోయింది. కానీ మరుసటి రోజు మళ్లీ ఆ మంద దూరం అయిపోయింది. అప్పుడు సరైన చికిత్సే అందించాం. కానీ దురదృష్ట వశాత్తూ అది మరణించింది. అప్పుడు అది గాయాల పాలైనట్లు తాము గుర్తించాం’’ అని అధికారులు ప్రకటించారు. 


కేరళ మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం కోసం ఊళ్లోకి వచ్చింది. కొందరు వ్యక్తులు బాణసంచా కూర్చిన పైనాపిల్‌ను నోటికి అందించారు. ఏనుగు ఆశగా దాన్ని  కొరకగానే నోట్లో పేలిపోయింది. భరించలేని బాధతో ఊరంతా పరుగులు పెట్టిన ఆ ఏనుగు.. పక్కనే ఉన్న వెల్లియార్ నదిలోకి వెళ్లింది. కొద్దిసేపటికి అక్కడే అలా నదిలో నిలబడే ప్రాణాలు వదిలింది. గ్రామస్థులెవరికీ హాని చేయని ఆ ఏనుగు కొందరు ఆకతాయిలు చేసిన పనికి బలైంది.


Updated Date - 2020-06-03T21:45:07+05:30 IST