ఏపీలో విక్రయాలు 40శాతం పెరిగాయ్
ABN , First Publish Date - 2020-11-01T08:33:51+05:30 IST
పండగల సీజన్ మొదటి 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సామ్సంగ్ గృహోపకరణాల విక్రయాలు ఆకర్షణీయంగా పెరిగాయి. స్మార్ట్ టీవీలు, అధిక సామర్థ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కలిగిన వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుకు వినియోగదారులు...
- సామ్సంగ్ వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పండగల సీజన్ మొదటి 20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సామ్సంగ్ గృహోపకరణాల విక్రయాలు ఆకర్షణీయంగా పెరిగాయి. స్మార్ట్ టీవీలు, అధిక సామర్థ్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కలిగిన వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపడంతో ఆంధ్రప్రదేశ్ గృహోపకరణాల అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది. టీవీల విభాగంలో అమ్మకాలు 41 శాతం పెరగ్గా.. 55 అంగుళాల, అంతకు మించిన టీవీల విభాగంలో విక్రయాలు 63 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. యూహెచ్డీ, క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీల విభాగంలో వరుసగా 50, 64 శాతం పెరుగుదల నమోదైంది.
రిఫ్రిజిరేటర్ల విక్రయాలు..
ఫ్రాస్ట్-ఫ్రీ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 43 శాతం పెరిగాయి. అధిక సామర్థ్యం కలిగిన సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 64 శాతం పెరిగినట్లు సామ్సంగ్ వెల్లడించింది. ఇటీవలి కాలంలో నగరాల్లోనే కాక ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఫుల్ ఆటోమేటెడ్ ఫ్రంట్లోడ్, టాప్లోడ్ వాషింగ్ మిషన్లకు ఆదరణ పెరుగుతోందని.. ఈ విభాగాల్లో విక్రయాలు వరుసగా 25శాతం, 27 శాతం పెరిగినట్లు పేర్కొంది. చూడచక్కటి రూపు, ప్రీమియం టెక్నాలజీ, బండిల్డ్ డీల్స్, ఆకర్షణీయ ఫైనాన్స్ పథకాలు మొదలైనవి ప్రీమియం గృహోపకరణాల కొనుగోలుకు వినియోగదారులను పురిగొల్పుతున్నట్లు వివరించింది.