నేడు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ABN , First Publish Date - 2022-08-08T05:19:20+05:30 IST
విద్యుత్ ఉద్యోగులు సోమవారం సమ్మె బాట పట్టనున్నారు.
కొత్తగూడెం ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష
విద్యుత్ బిల్లు 2022 రద్దుకోసం డిమాండ్
ఖమ్మంసంక్షేమవిభాగం, ఆగస్టు7: విద్యుత్ ఉద్యోగులు సోమవారం సమ్మె బాట పట్టనున్నారు. అటెండర్ నుంచి చీప్ ఇంజనీరింగ్ వరకు సమ్మెలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే విద్యుత్ ఉద్యోగ జేఏసీ అధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సమ్మె సమాచారం అందించారు. ఈనెల 10న పార్లమెంట్లో విద్యుత్ బిల్లు 2022ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్శాఖకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతోందని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ ఉద్యోగులు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి చేరుకొని జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగులు కొత్తగూడెంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట, ఖమ్మం జిల్లా ఉద్యోగులు ఖమ్మం ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపటనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.