Hyderabad Cityలో ఎలక్ట్రిసిటీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ..
ABN , First Publish Date - 2022-01-06T15:09:38+05:30 IST
వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్...
- ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యం
- సబ్స్టేషన్లపై అదనపు లోడ్ పడకుండా చర్యలు
- వేసవిలో పెరగనున్న డిమాండ్
- 75 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా
వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. రూ. 50 కోట్లు వెచ్చించి గ్రేటర్ జోన్లో డిస్ట్రిబ్యూషన్ల ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతో పాటు ఓవర్లోడ్ ఫీడర్లను విభజిస్తూ, సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్ సిటీ : గ్రేటర్జోన్లో ప్రస్తుతం 56 నుంచి 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. అది మార్చి నాటికి 75 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తు న్నారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా పను లు పూర్తిచేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
500కు పైగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు
విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఆయా ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్జోన్లో సుమారు 500కు పైగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే మరో 100 ట్రాన్స్ఫార్మర్లు పెంచుతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అదనపు డిమాండ్ మేరకు ఒక్కో సర్కిల్లో 60 నుంచి 70 వరకు అదనపు డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు మార్పు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపుపై కార్పొరేట్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రెండోవారంలో సీఎండీ సమీక్ష..
సబ్స్టేషన్లపై అదనపు లోడ్ పడకుండా ఇప్పటికే గ్రేటర్జోన్ వ్యాప్తంగా 150కి పైగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మే నెలల్లో గ్రేటర్లో 75- 80 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ నమోదైనా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా డిస్కం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్పై రెండో వారంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.