కూలీలకు విద్యుదాఘాతం

ABN , First Publish Date - 2022-05-18T06:04:04+05:30 IST

విద్యుదాఘాతానికి గురై ఒక కూలీ మృతి చెందాడు.

కూలీలకు విద్యుదాఘాతం
విద్యుత్‌ లైన్‌ కింద నిలిపి ఉంచిన లారీ

ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం

ఏడుగురికి స్వల్పగాయాలు

పెదవేగి, మే 17: విద్యుదాఘాతానికి గురై ఒక కూలీ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురు స్వల్ప గాయాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదవేగి ఎస్‌ఐ వైవీవీ.సత్యనా రాయణ తెలిపిన వివరాలివి.. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన 14 మంది కూలీలు, పెదవేగి మండలం బాపిరాజుగూడెం పరిధిలో లారీలోకి కొబ్బరిపొట్టు లోడు చేసేందుకు మంగళవారం ఉదయం వచ్చారు. కొబ్బరిపొట్టు గుట్ట దగ్గర లారీని నిలిపి, బస్తాలను లారీలో ఎక్కించారు. చివరిగా బస్తాలు బిగుతుగా ఉండేందుకు మోకు(తాడు) బిగిస్తున్నారు. ఆ సమయంలో లారీపై ఉన్న సొంగా అశోక్‌(ఇసాక్‌) అనే కూలీ లారీ పైభాగంలో ఉండి మోకును సరి చేస్తున్నాడు. మరికొంతమంది కూలీలు కింద నుంచి మోకును లాగుతున్నారు. ఆ సమయంలో లారీపై ఉన్న అశోక్‌కు హైటెన్షన్‌ విద్యుత్‌వైరు (కండక్టర్‌) తాకింది. దీంతో అశోక్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనినుంచి విద్యుత్‌ ప్రవహించి, కింద మోకు లాగుతున్న మరికొందరు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే విద్యుత్‌ లైన్‌ ట్రిప్‌ కావడంతో పెనుప్రమాదమే తప్పింది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే సొంగా అశోక్‌(20) మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో మద్దాల ఏసు(రాంబాబు), కలపాల సురేష్‌కు గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ తరలించారు. మరో ఏడుగురు స్పల్పగాయాలతో బయటపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

కాట్రేనిపాడులో విషాదచాయలు

ముసునూరు : ఈ ఘటనతో కాట్రేనిపాడులో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఏస్సీకాలనీకి చెందిన పది మంది విద్యుదాఘాతం బారిన పడ్డారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు కావడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి అబ్రహం ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయాడు. తల్లి మార్తమ్మ, అశోక్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్‌ మృతి చెందడంతో తల్లి అనాథగా మారింది. కలపాల సురేష్‌, మద్దాల ఏసుల కుటుంబాలు కూడా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సురేష్‌కు గత ఏడాది వివాహమైంది. భార్య గర్భిణు, ఏసుకు వివాహమై రెండేళ్లు కాగా ఆతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. బతుకుతెరువు కోసం వెళ్లిన ఈ ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

  నాకు దిక్కెవరు.. 

ఎనిమిదేళ్ల క్రితమే భర్తను కోల్పోయి, ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోవడంతో ఇక నాకు దిక్కెవరు అంటూ అశోక్‌  తల్లి మార్తమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కొన్ని నెలల నుంచి కొబ్బరిపీచు కర్మాగారానికి పనికి వెళుతున్నాడని, ఎప్పటిలాగే ఉదయాన్నే భోజనం వండి క్యారేజ్‌ కట్టి ఇచ్చానని, ఫ్యాక్టరీలో అలస్యమై ఇంటికి రావడం లేటైతే కంగారు పడవద్దమ్మా అని నా కొడుకు చెప్పివెళ్లాడని తల్లి బోరున విలపిస్తోంది. నాకుతోడు నా కొడుకేనని, భర్త చనిపో యినా కుంగిపోకుండా కొడుకును పెంచుకున్నానని, చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో నేను ఎలా బతకాలని అశోక్‌ తల్లి మార్తమ్మ పడుతున్న బాధ వర్ణనాతీతం.   


Updated Date - 2022-05-18T06:04:04+05:30 IST