ఏసీబీ వలలో విద్యుత్ అధికారులు
ABN , First Publish Date - 2022-07-05T05:01:00+05:30 IST
ఏసీబీ వలలో విద్యుత్ అధికారులు
ఘట్కేసర్, జూలై 4: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండల విద్యుత్ ఏఈ రాజనర్సింగరావు, సబ్ ఇంజనీర్ అశోక్ లంచం తీసుకుంటూ సోమవారం సాయంత్రం అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఘట్కేసర్ మండల పరిధిలోని అవుషాపూర్ గ్రామంలో ఒక ట్రాన్స్ఫార్మర్, రెండు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అంకుషాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే కాంట్రాక్టర్ను ఏఈ రాజనర్సింగరావు రూ.19వేలు, సబ్ ఇంజనీర్ అశోక్ రూ.3వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ విషయమై నవీన్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విద్యుత్ కార్యాలయం వద్ద నిఘా ఏర్పాటుచేసి ఏఈ, సబ్ ఇంజనీర్లు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు విద్యుత్ కార్యాలయంలో, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రశాంత్నగర్లో ఉన్న ఏఈ నివాసం, కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో గల సబ్ ఇంజనీర్ నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఆ ఇద్దరినీ నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.