విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-10T06:55:26+05:30 IST

సంయుక్త కిసాన్‌ మోర్చాకు ఇచ్చిన హామీలు విస్మరించి, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ కౌలురైతు సంఘం డిమాండ్‌ చేసింది

విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

- నేడు బిల్లు ప్రతులను దహనం చేసి నిరసన

- ఏపీ కౌలు రైతు సంఘం

ధర్నాచౌక్‌, ఆగస్టు 9 : సంయుక్త కిసాన్‌ మోర్చాకు ఇచ్చిన హామీలు విస్మరించి, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని, ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ కౌలురైతు సంఘం డిమాండ్‌ చేసింది. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా బిల్లు ప్రతులను దహనం చేసి తమ నిరసనను తెలియజేయాలని కౌలు రైతులు, రైతులు, వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు రైతు సంఘాలతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదన్నారు. వ్యవసాయ రంగానికి మినహాయింపులు ఇస్తామని కిసాన్‌ మోర్చా నాయకులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం దారుణమన్నారు. ఈ విద్యుత్‌ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం జరిగితే వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోతుందన్నారు. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ రద్దు అవుతుందని, పేదలకు, బలహీన వర్గాలకు ఇచ్చే సబ్సీడీలు రద్దు అవడంతో పాటు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడతాయన్నారు.

 

Updated Date - 2022-08-10T06:55:26+05:30 IST