విద్యుత్‌ ఏఎల్‌ఎం అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-05-26T04:35:19+05:30 IST

మండలంలోని చినఅన్నలూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బండ్ల ధనుంజయ(39) మృతదేహం అనుమానస్పద స్థితిలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

విద్యుత్‌ ఏఎల్‌ఎం అనుమానాస్పద మృతి
బండ్ల ధనుంజయ (ఫైల్‌)

కలిగిరి, మే 25: మండలంలోని చినఅన్నలూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బండ్ల ధనుంజయ(39) మృతదేహం అనుమానస్పద స్థితిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ సూర్యప్రకాష్‌రెడ్డి కథనం మేరకు.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన బండ్ల ధనుంజయ చినఅన్నలూరులో అసిస్టెంట్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తరచూ మద్యం సేవిస్తూ విధులకు గైర్హాజరవుతుండడంతో సంబంధిత శాఖ అధికారులు ఇటీవల మెమో కూడా ఇవ్వడంతో ప్రస్తుతం విధులకు హాజరు కావడంలేదు.  ఈ క్రమంలో ధనుంజయ కనుపడటం లేదని ఆయన భార్య ఏప్రిల్‌ 16న ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసి అప్పటి నుంచి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలంపాడు నుంచి కమ్మవారిపాలెం వెళ్లే పొలాల దారిలో మృతదేహం ఉన్నట్లు పశువుల కాపర్ల నుంచి బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ సూర్యప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మిస్సింగ్‌ కేసుగా నమోదైన ధనుంజయ కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలంలోని ఆనవాళ్లను తెలపగా వారు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించి ఆ రిపోర్టును బట్టి విచారణ చేపడుతామని సీఐ తెలిపారు.

Updated Date - 2022-05-26T04:35:19+05:30 IST