సూపర్వైజర్తో గొడవపడ్డ ఎలక్ట్రీషియన్.. మరుసటి రోజు అత్యంత కిరాతకంగా..
ABN , First Publish Date - 2021-10-03T23:14:02+05:30 IST
యజమానితో గొడవపడ్డ ఓ ఎలక్ట్రీషియన్..అతడి మొహంపై పిడిగుద్దులు కురిపించి అక్కడి నుంచి పారిపోయాడు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తరువాత.. తన సహోద్యోగులపై కర్రతో దాడి చేసి నలుగురిని పొట్టనపెట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: తన సూపర్వైజర్తో గొడవపడ్డ ఓ ఎలక్ట్రీషియన్..అతడి మొహంపై పిడిగుద్దులు కురిపించి అక్కడి నుంచి పారిపోయాడు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తరువాత.. తన సహోద్యోగులపై కర్రతో దాడి చేసి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడు. శనివారం ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేగింది. పబ్లిక్స్ కార్పొరేషన్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న షాన్ రన్యన్ శుక్రవారం నాడు లేక్ల్యాండ్లోని వర్క్ సైట్ వద్ద తన సూపర్వైజర్తో గొడవపడ్డాడు. ఆ సమయంలో అతడిపై చేయి కూడా చేసుకున్నాడు. అనంతరం..అక్కడి నుంచి పారిపోయాడు. అతడు తన స్వస్థలమైన పెన్సిల్వేనియా రాష్ట్రానికి పారిపోయి ఉంటాడేమోనని అంతా భావించారు.
అయితే..శనివారం నాడు అతడు.. కంపెనీ తన ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహంలోకి ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న తన సహోద్యోగులపై అత్యంత కిరాతకంగా దాడికి దిగాడు. నిద్రపోతున్న ఓ వ్యక్తిని కర్రతో చితకబాదటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరోముగ్గురిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. మరో వ్యక్తి కూడా ఘటనా స్థలంలోనూ మరణించగా ఓ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఓ కుటుంబం మాత్రం అదృష్టవశాత్తూ అతడి నుంచి తప్పించుకోగలిగింది. అయితే.. ఈ దారుణానికి పాల్పడ్డ రెండు గంటల తరువాత.. నిందితుడు రక్తంతో తడిసిన దుస్తుల్లో లేక్వెల్స్ ప్రాంతంలో ఓ ఇంటివద్ద కనిపించాడు. ఆస్పత్రికి వెళ్లాలంటూ ఆ ఇంటి యజమాని అతడికి సూచించాడు. అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంతటి ఉన్మాదిగా మారడానికి కారణమేంటో తెలియరాలేదని అక్కడి పోలీసు ఉన్నాతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.