సీఎం జగన్కు సీపీఐ నారాయణ సవాల్
ABN , First Publish Date - 2020-10-01T09:02:59+05:30 IST
‘ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను....
- మీటర్లు బిగించి చూడు... ఏమవుతుందో?
అనంతపురం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను. మీటర్లు బిగించి చూడు... ఏమవుతుందో?’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. ‘విద్యుత్ మీటర్లు పెట్టాలని ప్రధాని చెప్పలేదు. తగదునమ్మా అంటూ.. బాంఛన్ దొరా అనేవిధంగా మీటర్లు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటు. తమరు చెప్పినట్లు మీటర్లు పెడతా దొరా! నన్ను మాత్రం జైలుకు పంపొద్దని ప్రధానిని వేడుకుంటున్నట్లుగా వ్యవసాయ బిల్లులకు వత్తాసు పలుకుతున్నారు. జగన్కు రాబోవు రోజుల్లో పుట్టగతులుండవు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా అనంతపురంలోని బీఎ్సఎన్ఎల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ఆందోళన చేశాయి.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులతో సన్న చిన్నకారు రైతులు పంటలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సంసారం ఉండి పిల్లలున్న వారికైతే ఆ బాధ తెలుస్తుంది. అవేమీ లేని ప్రధాని మోదీకి ఏమి తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఆందోళనలో భాగంగా బీఎ్సఎన్ఎల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోతున్న నారాయణతోపాటు ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు.