మాచానివారు లేని ఎన్నికలు
ABN , First Publish Date - 2021-03-08T05:35:56+05:30 IST
చేనేతపురికి మకుటం మాచాని కుటుంబం. ఎమ్మిగనూరు పట్టణ రాజకీయాల్లో మాచాని వంశానికి ప్రాధాన్యం ఉంటుంది
- తొలిసారిగా పురపోరుకు దూరం
- పంచాయతీ మొదలు.. మున్సిపాలిటీ వరకూ వారే..
- 56 ఏళ్ల పాటు ఎమ్మిగనూరు రాజకీయాల్లో కీలకం
ఎమ్మిగనూరు, మార్చి 7: చేనేతపురికి మకుటం మాచాని కుటుంబం. ఎమ్మిగనూరు పట్టణ రాజకీయాల్లో మాచాని వంశానికి ప్రాధాన్యం ఉంటుంది. 56 ఏళ్ల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో వీరు బరిలో దిగుతూనే ఉన్నారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వారు దూరంగా ఉండిపోయారు. వర్తమాన రాజకీయాలు రుచించక ఈ నిర్ణయం తీసుకున్నారా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయంతో స్పష్టత లేదు.
వారిదే ఆధిపత్యం
చేనేత వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్న ఎమ్మిగనూరులో పంచాయతీగా ఉనప్పటి నుంచి గ్రేడ్ వన్ మున్సిపాలిటీ స్థాయికి ఎదిగే వరకు(2005 ఎన్నికల వరకు) మాచాని కుటుంబం ఆధిపత్యం కొనసాగింది. 1956 నుంచి 1964 వరకు మాచాని శివన్న గ్రామ పంచాయతీ ప్రెసిడెం ట్గా కొనసాగారు. 1965లో మున్సిపాలిటీగా ఏర్పడిన రెండేళ్ళ తరువాత 1967లో తొలి ఎన్నికలు జరిగాయి. సోమప్ప కుమారుడు మాచాని శివన్న చైర్మన్గా ఎంపికయ్యారు. 1981లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎం ఎస్ శివన్న ఏకగ్రీవంగా చైర్మన్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మిగ నూరును ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తించి రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందిం చింది. 1987లో జరిగిన ఎన్నికల్లో ఎంఎస్ శివన్న మరోసారి చైర్మన్ ఎన్నికయ్యారు. పదవిలో 1992 వరకు కొనసాగారు.
1994 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాచాని కుటుంబం, ఎన్నికల అనంతరం మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరింది. 1995లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎంఎస్ శివన్న గెలిచారు. 2000 వరకు మున్సిపల్ చైర్మన్ కొనసాగారు. 2001లో మున్సిపాలిటీని మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో మాచాని శివన్న పెద్ద కోడలు హారతి జగదీష్ను తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి నిలిపి గెలిపించుకున్నారు. ఆమె 2005 వరకు పదవిలో కొనసాగారు.
2005 సెప్టెంబరులో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరుపున మాచాని కుటుం బం నుంచి మాచాని రఘునాథ్ బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చె ందిన బుట్టా రంగయ్య చైర్మన్గా ఎన్నియ్యారు. అలా తొలి సారిగా మాచాని కుటుంబేతరులు చైర్మన్ కుర్చీ ఎక్కారు. ఆ తరువాత మాచాని రఘునాథ్ వైసీపీలో చేరారు. 2014 జూలైలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాచాని రఘునాథ్ వైసీపీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు. ఇలా ప్రతి ఎన్నికల్లో బరిలో దిగుతూ, మాచాని కుటుంబం ఉనికి చాటుకుంది. ఈ ఎన్నికల్లో ఆ కుటుంబం ప్రస్తావన లేకపోవడం పట్టణంలో చర్చనీయాంశమైంది.