ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-02-24T04:53:28+05:30 IST
పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్, నగరపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.హరికిరణ్ ఎన్నికల నిర్వహణాధికారులను ఆదేశించారు.
శిక్షణలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరికిరణ్
కడప (కలెక్టరేట్), ఫిబ్రవరి 23 : పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్, నగరపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.హరికిరణ్ ఎన్నికల నిర్వహణాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సభాభవనంలో మున్సిపల్, నగర పాలక, లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఎన్నికల, సహాయ అధికారులు, మాస్టర్ ట్రైనీలకు జేసీ ధర్మచంద్రారెడ్డి అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఎలా నిర్వహించారో అదేవిధంగా ఈ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ల ఉపసంహరణ విషయంలో కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతించాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఎలక్ర్టోరల్ రోల్ పక్రియను విధిగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్ల జాబితా ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, డిక్లరేషన్ ఫారాల సెట్ను అందజేయాలన్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విధులను నిర్వహించాలన్నారు. పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లకు సరిపడే విధంగా శానిటైజర్లు, మాస్కులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్వర్మ, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్గార్గ్, జడ్పీ సీఈఓ సుధాకర్రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రోహిణి, సుజన, జిల్లా అధికారులు దీప్తి, మురళీమనోహర్, యఽధుభూషణ్రెడ్డి, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఆర్వోలు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.