జార్ఖండ్ సీఎంకు పదవీ గండం !.. అవినీతి ఆరోపణలపై రంగంలోకి ఈసీ
ABN , First Publish Date - 2022-04-22T03:08:17+05:30 IST
న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై అవినీతి ఆరోపణలు ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. మైనింగ్ లీజు వ్యవహారంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎన్నికల సంఘ దర్యాప్తు జరుపుతుండడమే ఇం
న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై అవినీతి ఆరోపణలు ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. మైనింగ్ లీజు వ్యవహారంలో ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎన్నికల సంఘ దర్యాప్తు జరుపుతుండడమే ఇందుకు కారణం. ఆయన అవినీతికి పాల్పడ్డారని తేలితే ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటుపడే ముప్పుపొంచివుంది. గతేడాది జూన్లో హేమంత్ సోరెన్కు స్టోన్ క్వారీ మైనింగ్ లీజు దక్కింది. రాజ్యాంగబద్ద పదవిలో కొనసాగుతున్నవ్యక్తి ఇతర లాభదాయకమైన పదవులు చేపట్టడంపై దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ కోరారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తునకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. మైనింగ్ లీజు వ్యవహారం 0.88 ఎకరాల భూమికి సంబంధించినదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రఘుబర్ దాస్ అందించిన ఆధారాలను ఎన్నికల సంఘానికి గవర్నర్ సమర్పించారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం.. ఎన్నికల సంఘం అభిప్రాయం ఆధారంగా శాసనసభకు ఎన్నికైన ఏ చట్టసభ్యుడిపైనైనా గవర్నర్ అనర్హత వేటు వేసే అధికారం ఉంటుంది.
కాగా మైనింగ్ లీజు వ్యవహారంలో తప్పుజరిగిందని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మైనింగ్ లీజును ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విరమించుకున్నారని గతంలోనే తెలిపింది. అయినప్పటికీ ఆయనపై విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన హేమంత్ సోరెన్ 2019 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.