Uddhav Vs Shinde : వచ్చే నెల 8లోగా మెజారిటీ నిరూపించుకోండి... శివసేనలో గ్రూపులకు ఎన్నికల కమిషన్ ఆదేశం...

ABN , First Publish Date - 2022-07-23T19:18:47+05:30 IST

బలాన్ని నిరూపించుకునేందుకు శివసేనలోని ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్

Uddhav Vs Shinde : వచ్చే నెల 8లోగా మెజారిటీ నిరూపించుకోండి... శివసేనలో గ్రూపులకు ఎన్నికల కమిషన్ ఆదేశం...

న్యూఢిల్లీ : బలాన్ని నిరూపించుకునేందుకు శివసేనలోని ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలకు ఎన్నికల కమిషన్ వచ్చే నెల 8 వరకు గడువు విధించింది. తమకు మాత్రమే ఆధిక్యత ఉందని నిరూపించేందుకు దస్తావేజుల రూపంలోని సాక్ష్యాధారాలను సమర్పించాలని తెలిపింది. పార్టీలోని శాసన, సంస్థాగత విభాగాల్లో ఎవరికెంత మద్దతు ఉందో తెలుసుకునేందుకు వీలుగా సంతకాలతో కూడిన లేఖలను సమర్పించాలని చెప్పింది. 


ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే శివసేన లెజిస్లేటివ్, ఆర్గనైజేషనల్ విభాగాల్లోని తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన లేఖలను ఆగస్టు 8 మధ్యాహ్నం ఒంటి గంటకు సమర్పించాలని తెలిపింది. 


ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో అత్యధిక ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉద్ధవ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఉపసంహరించారు. దీంతో షిండే నేతృత్వంలో బీజేపీ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని షిండే చెప్తున్నారు. తన నేతృత్వంలోనే అసలైన శివసేన ఉందని చెప్తూ ఎన్నికల కమిషన్‌ను కూడా ఆశ్రయించారు. ఇటీవల షిండే వర్గం శాసన సభ సభాపతిని ఎన్నుకుంది, చీఫ్ విప్‌ను ఎంపిక చేసింది. మరోవైపు 19 మంది శివసేన ఎంపీల్లో 12 మంది షిండే వర్గంలోకి వచ్చారు. 


ఈ నియామకాలు చెల్లవని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన చెప్తోంది. శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఈ నియామకాలు చట్టవిరుద్దమని పేర్కొంది. 


మరోవైపు 282 మంది సభ్యులతో కూడిన శివసేన అధికారిక ఫోరం కూడా తమవైపు వచ్చే విధంగా షిండే వర్గం పావులు కదుపుతోంది. పార్టీ అధ్యక్షుడి నుంచి శాఖ ప్రముఖ్‌ల వరకు ఈ ఫోరంలో ఉంటారు. 


Updated Date - 2022-07-23T19:18:47+05:30 IST