షహర్ హమారా.. మేయర్ హమారా..
ABN , First Publish Date - 2020-11-30T05:25:03+05:30 IST
షహర్ హమారా.. మేయర్ హమారా..
జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి
ఘట్కేసర్ రూరల్: ‘‘కార్ హమారా.. షహర్ హమారా.. మేయర్ భీ హమారా..’’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాఫ్సింగారంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జడ్పీచైర్మన్ మాట్లాడుతూ బల్దియా ఎన్నికల్లో 104 కార్పొరేటర్ సీట్లు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని తెలిపారు. గత ఆరేళ్ల పాలనలో భారతీయ జనతాపార్టీ మన హైదరాబాద్కు చేసింది ఏమీలేదన్నారు. ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపడానికే ప్రణాళికలు రచిస్తుందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలకు కావాల్సింది గల్లీ నాయకులే కానీ ఢిల్లీ నాయకులు కాదన్నారు. ఈ విషయాన్ని గమనించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి బీజేపీ నాయకులు చూస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారాలకు బీజేపీ జాతీయనాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో నగర ప్రజలు తమకు పట్టంకడుతారని, బల్దియా పీఠంపై గులాబీజెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఓటు వేసే ముందే ఒక్కసారి ఆలోచించి టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని నగర ప్రజలను జడ్పీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు.