వలసపల్లెలో తమ్ముడిని నరికిన అన్న

ABN , First Publish Date - 2022-01-18T05:45:07+05:30 IST

మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి నిర్వహించిన పశువుల పండుగ సంబరాల్లో విషాదం అలుముకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన అన్న వేటకొడవలితో తమ్ముడిని నరికేశాడు.

వలసపల్లెలో తమ్ముడిని నరికిన అన్న
సురేష్‌(పైల్‌ఫొటో)

పశువుల పండుగ సంబరాల్లో విషాదం


మద్యం మత్తు, మనస్పర్థలే హత్యకు కారణం            


మదనపల్లె క్రైం, జనవరి 17: మదనపల్లె మండలం వలసపల్లెలో ఆదివారం రాత్రి నిర్వహించిన పశువుల పండుగ సంబరాల్లో విషాదం అలుముకుంది. మద్యం మత్తులో ఆవేశానికి గురైన అన్న వేటకొడవలితో తమ్ముడిని నరికేశాడు. తాలూకా పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... వలసపల్లెకు చెందిన తలారి లక్ష్మన్న కుమారుడు టి.సురేష్‌(26) దినసరి కూలి. తల్లి గంగులమ్మకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏటా నిర్వహించే పశువుల పండుగకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని నడివీధి గంగమ్మకు పొట్టేలు నరకడం ఆనవాయితీ. అయితే ఈసారి సురేష్‌ చందా ఇవ్వలేదు.  కాగా ఆదివారం రాత్రి సంబరాల్లో భాగంగా గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చిట్లాకుప్పకు నిప్పంటించి, ఆ తరువాత నడివీధి గంగమ్మకు దీలుబోనాలు సమర్పించారు. ఈక్రమంలో అప్పటికే మద్యంమత్తులో వున్న సురేష్‌ గంగమ్మ వద్ద డ్రమ్స్‌, పలకలు కొడుతుండడంతో డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టాడు. దీన్ని గమనించిన దాయాదైన తలారి చలపతి డ్రమ్స్‌, పలకలు కొట్టడాన్ని ఆపించాడు. చందా ఇవ్వని వ్యక్తికి డ్యాన్స్‌ చేసే హక్కు లేదన్నాడు. దీంతో వారు కొట్టడం ఆపేశారు. అయితే పలకలు కొట్టాలంటూ సురేష్‌ వారితో గొడవకు దిగడంతో వాగ్వాదం జరిగింది.  దీంతో ఆవేశానికి గురైన చలపతి... సురేష్‌ను పక్కకు నెట్టాడు. అతడు తిరగబడడంతో చేతిలోని వేటకొడవలితో సురేష్‌ మెడపై నరికాడు. అధిక రక్తస్రావమై బాధితుడు కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. రాత్రి 8.30-9.00 గంటల మధ్య ఈ ఘటన జరిగితే రాత్రి 10 గంటలకు బాధితుడిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి దారిలో మృతిచెందినట్లు నిర్ధరణ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ శ్రీనివాసులు ఆస్పత్రికి చేరుకుని  ఘటనపై ఆరా తీశారు. అదేవిధంగా గ్రామానికి వెళ్లి విచారించారు. సంబరాల్లో భాగంగా పొట్టేలు తల అనుకుని మనిషి తల నరికేశాడంటూ... అలాగే గంగమ్మకు నరబలి ఇచ్చారంటూ... సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. తీరా విచారణలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కొడవలితో తమ్ముడిని నరికాడని తెలిసింది. ఈక్రమంలో పోలీసులు చలపతిని అరెస్టు చేశారు. అనంతరం మార్చురీ వద్ద ఘటనకు  సంబంధించిన వివరాలను సీఐ మీడియాకు తెలిపారు.  సురేష్‌, చలపతి కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవలు జరిగినట్లు చెప్పారు. వాటిని మనసులో పెట్టుకుని పండుగ సంబరాల్లో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 



Updated Date - 2022-01-18T05:45:07+05:30 IST