అన్న వెంటే తమ్ముడు
ABN , First Publish Date - 2022-05-20T07:06:20+05:30 IST
బొజ్జల కుటుంబం మరోసారి దుఃఖసాగరంలో మునిగిపోయింది.
బొజ్జల హరినాథరెడ్డికి ప్రముఖుల నివాళి
దుఃఖసాగరంలో బొజ్జల కుటుంబీకులు
శ్రీకాళహస్తి, మే 19 : బొజ్జల కుటుంబం మరోసారి దుఃఖసాగరంలో మునిగిపోయింది.ఇటీవలే కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉత్తరక్రియలు బుధవారం శ్రీకాళహస్తి మండలం ఊరందూరులోని ఆయన స్వగృహంలో జరిగాయి. పగలంతా వచ్చిన బంధువులను,రాజకీయ ప్రముఖులను పలకరించిన గోపాల కృష్ణారెడ్డి తమ్ముడు హరినాథ రెడ్డి అదే రోజు రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం బొజ్జల కుటుంబాన్ని తీవ్ర విషాదానికి లోను చేసింది.దశాబ్దాలపాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ రాజకీయాలను శాసించిన గోపాలకృష్ణారెడ్డికి హరినాథ రెడ్డి అండగా వుంటూ వచ్చారు.అభివృద్ధి కార్యక్రమాలు, అసెంబ్లీ సమావేశాలు తదితర పనులపై ఎక్కువగా అన్న హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నా స్థానికంగా టీడీపీ క్యాడర్కు,ప్రజలకు హరినాథరెడ్డి అందుబాటులో వుంటూ వచ్చారు.మాజీ ఎంపీపీగా పని చేశారు.అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన వద్దకు పార్టీలకు అతీతంగా జనం వచ్చి సమస్యలను చెప్పుకునేవారు.గురువారం ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.అన్న వెంటే జీవితాంతం నడిచిన హరినాథ రెడ్డి చావులో కూడా ఆయన్ను అనుసరించిన విధివిచిత్రం గురించి చర్చించుకున్నారు.