Maharashtra Crisis : షిండే ముందు ఉన్న మార్గం వేరొక పార్టీలో విలీనమవడమే!

ABN , First Publish Date - 2022-06-26T21:13:11+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారకులైన శివసేన ఎమ్మెల్యేలు సరైన వ్యూహం

Maharashtra Crisis : షిండే ముందు ఉన్న మార్గం వేరొక పార్టీలో విలీనమవడమే!

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారకులైన శివసేన ఎమ్మెల్యేలు సరైన వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీలో చీలికకు గుర్తింపు లభించదని, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల ముందు ఉన్న ఏకైక మార్గం ఏదైనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలో చేరడం మాత్రమేనని అంటున్నారు. తిరుగుబాటు బావుటాను ఎగురవేసే ముందు వీరు సరైన న్యాయ సలహా తీసుకోలేదేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమిలోని శివసేన నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే తగిన స్థాయిలో వ్యూహ రచన చేయలేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆయన వర్గం ఎమ్మెల్యేలు న్యాయపరమైన చిక్కుల్లో పడబోతున్నారని, వారంతా ఇప్పుడు అయోమయంలో ఉన్నారని అంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఈ వర్గం క్షుణ్ణంగా తెలుసుకోలేదని అంటున్నారు. ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం ఓ బోనులో చిక్కుకున్నారని, ఆయన బయటపడే మార్గం లేదని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీజీ కోల్సే పాటిల్ చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం కూడా రావచ్చునని తెలిపారు.  మహారాష్ట్రలో సుదీర్ఘ న్యాయ పోరాటం తప్పదని మరికొందరు నేతలు చెప్తున్నారు. 


న్యాయ నిపుణులు, సీనియర్ రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల ప్రకారం, శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు ఏక్‌నాథ్ షిండేకు ఉన్నప్పటికీ, ఆ పార్టీని చీల్చి, ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే, ఆ వర్గంలోని ఎమ్మెల్యేలంతా అనర్హత వేటుకు గురికాక తప్పదు. దీని నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం కేవలం ఏదైనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలో వీరంతా చేరిపోవడమే. పార్టీలో చీలికను ఫిరాయింపుల నిరోధక చట్టం గుర్తించదు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు జట్టు కడితే, వారు ప్రత్యేకంగా ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించిన తర్వాత అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అసలు పార్టీ నుంచి వేరుపడిన వర్గానికి, చీలికకు గుర్తింపు, చెల్లుబాటు ఉండబోవు. 


ఏక్‌నాథ్ షిండే వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలకు బీజేపీలో చేరడంపై అభ్యంతరాలు ఉంటే, ఇండిపెండెంట్ లెజిస్లేటర్ బచ్చు కడే నేతృత్వంలోని ప్రహార్ అనే ఆర్గనైజేషన్‌లో చేరే అవకాశం ఉందని కూడా కొందరు ఊహిస్తున్నారు. 2024లో జరిగే లోక్‌సభ, శాసన సభల ఎన్నికల్లో తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో వీరు బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవచ్చునని భావిస్తున్నారు. 


Updated Date - 2022-06-26T21:13:11+05:30 IST