Eknath Shinde: ‘మహా’ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్.. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఏక్నాథ్ షిండే..
ABN , First Publish Date - 2022-06-30T22:15:12+05:30 IST
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేనే (Eknath Shinde) మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి (Maharashtra CM) అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్ (Fadnavis) ప్రకటించారు. సీఎం పదవిని ఫడణవీస్ చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ ‘మహా’ సంక్షోభంలో (Maha Crisis) బీజేపీ (BJP) పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశంతోనే షిండేను సీఎంగా బీజేపీ ప్రకటించి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సర్కార్ రెబల్స్ ఆధ్వర్యంలో ఏర్పడనుంది.
షిండేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అయితే.. షిండేకు బయటి నుంచి మద్దతు ఇస్తామని ఫడ్నవీస్ వెల్లడించారు. ఏక్నాథ్ షిండేతో కలిసి గవర్నర్ను కలిసిన అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందని గుర్తుచేశారు. బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని, బీజేపీ-శివసేన కూటమికే ప్రజలు పట్టం కట్టారని ఫడ్నవీస్ చెప్పారు. ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే యూటర్న్ తీసుకున్నారని, మరాఠీల తీర్పును ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) పక్కన పెట్టారని ఫడ్నవీస్ (Fadnavis) ఆరోపించారు. బాల్ఠాక్రే (Bal Thackeray) ఆశయాలకు ఉద్ధవ్ తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. రెండున్నరేళ్లలో మహారాష్ట్ర అభివృద్ధికి నోచుకోలేదని, హిందుత్వం, సావర్కర్ను (Savarkar) రోజూ అవమానించారని ఫడ్నవీస్ విమర్శించారు. సావర్కర్ వ్యతిరేకులతో ఉద్ధవ్ చేతులు కలిపారని మండిపడ్డారు.