కాన్పూర్‌లో క్రిమినల్స్ కాల్పులు...8 మంది పోలీసుల మృతి

ABN , First Publish Date - 2020-07-03T12:44:00+05:30 IST

కరడు కట్టిన నేరస్థులు జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో సహా 8 మంది పోలీసులు మరణించిన విషాద ఘటన....

కాన్పూర్‌లో క్రిమినల్స్ కాల్పులు...8 మంది పోలీసుల మృతి

కాన్పూర్ (ఉత్తర్ ప్రదేశ్): కరడు కట్టిన నేరస్థులు జరిపిన కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రాతో సహా 8 మంది పోలీసులు మరణించిన విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కరడుకట్టిన నేరస్థుడైన వికాస్ దూబే గ్యాంగ్ ను  గురువారం రాత్రి పట్టుకునేందుకు 16 మంది పోలీసు బృందం వెళ్లింది. భవనం పైన తుపాకులతో సిద్ధంగా ఉన్న వికాస్ దూబే ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు తామున్న భవనం వద్దకు రాకుండా జేసీబీని అడ్డుపెట్టి రోడ్డును మూసివేశారు. ముఠా సభ్యులు జరిపిన కాల్పుల్లో ఒక డీఎస్పీ, ముగ్గురు సబ్ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మరణించారు. పోలీసులపై కాల్పులు జరిపిన ముఠా సభ్యులు పారిపోయారు. ముఠాసభ్యుల కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి ఎస్పీ, ఐజీలతోపాటు ఫోరెన్సిక్ బృందాలు వచ్చాయి. ఎస్పీలు దినేష్ కుమార్,అనిల్ కుమార్ లు పోలీసు సిబ్బందితో కలిసి వచ్చి క్రిమినల్ గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే ముఠా సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూనే ఉన్నారు. పోలీసులను చంపిన నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీజీపీ హెచ్ సీ అవస్థీని ఆదేశించారు. పోలీసుల మృతిపై సీఎం సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-07-03T12:44:00+05:30 IST