మత సామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్
ABN , First Publish Date - 2022-05-26T05:20:19+05:30 IST
మత సామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్
వికారాబాద్, మే 25 : ఈద్ మిలాప్ మత సామరస్యానికి ప్రతీకని జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ అయేషా సుల్తానా అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఇస్లామిక్ సెంటర్లో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా అన్నిమతాలకు చెందిన వ్యక్తుల మధ్య సోదరభావాన్ని, మతసామరస్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తోందన్నారు. మతాలు, కులాలు వేరైనా తామంతా ఒక్కటేననే అన్యమత వర్గాల నాయకులంతా.. నేడు ఒకే వేదికపైకి వచ్చి, తమను ఎవ్వరూ విడదీయలేరనే సందేశాన్ని ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. అనంతరం మునిసిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్ మాట్లాడుతూ మానవత్వం, మత సామరస్యం, సోదరభావాన్ని పెంచేలా కుల, మతాల కతీతంగా అందరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మహిళా కౌన్సిలర్లు, జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం సభ్యులు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.