ఎవర్ గివెన్కు బిలియన్ డాలర్ల జరిమానా
ABN , First Publish Date - 2021-04-14T02:14:41+05:30 IST
సూయజ్ కెనాల్లో గత వారం ఇరుక్కుపోయిన ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని..
కైరో: సూయజ్ కెనాల్లో గత వారం ఇరుక్కుపోయిన ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన ఈజిప్టులోని సూయజ్ కాలువలో గత నెల 23న భారీ రవాణా నౌక ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల రోజుల తరబడి ప్రపంచ వాణిజ్యం స్థంభించిపోయింది. దాదాపు వారం రోజులు కష్టపడి డ్రెడ్జర్లు, టగ్ బోట్ల సాయంతో ఆ నౌకను ఎలాగోలా పక్కకు తెచ్చిన అధికారులు నౌకను విడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది.
కాగా.. ఆసియా, యూరప్ల మధ్య సరుకు రవాణాకు సూయజ్ కెనాల్ ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గంలో ప్రతి రోజూ వందల నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలోనే యూరప్ నుంచి ఆసియా వైపు వస్తున్న ఎవర్ గివెన్ కార్గో నౌక సూయజ్ కెనాల్లో ప్రవేశించింది. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత గాలి తాకిడికి గురై పక్కకు తిరిగి ఇరు వైపుల ఇసుక దిబ్బల మధ్య చిక్కుకుపోయింది. 2 లక్షల టన్నులకు పైగా బరువున్న నౌక ఒక్కసారిగా అలా చిక్కుకు పోవడంతో దానిని తొలగించడం అధికారులకు అత్యంత కష్టంగా మారింది.
అంతేకాకుండా ఎవర్ గివెన్ అడ్డంగా ఉండడంతో వందల నౌకలు దాని వెనుక నిలిచిపోయాయి. మొత్తంగా 369 నౌకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రతి రోజూ 9 బిలియన్ డాలర్లు(రూ.65.205 కోట్లు) నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఈ కారణంగానే బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని వారు పట్టు పట్టి కూర్చుకున్నారు. కాగా.. కాలువ నుంచి విజయవంతంగా తొలగించిన తరువాత ఎవర్ గివెన్ కార్గో నౌకను ఈజిప్ట్ అధికారులు గ్రేట్ బిట్టర్ లేక్కు తరలించి అక్కడ ఉంచారు.