మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకున్న ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు
ABN , First Publish Date - 2021-06-20T11:02:25+05:30 IST
హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయటికి వెళుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును గ్రామీణ ఉపాధి హామీ(ఈజీఎస్) పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం ఉదయం అడ్డుకున్నారు.
మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు.. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
హన్మకొండ టౌన్, జూన్ 19: హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయటికి వెళుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును గ్రామీణ ఉపాధి హామీ(ఈజీఎస్) పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం ఉదయం అడ్డుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ‘దయాకర్రావు డౌన్డౌన్, ఎర్రబెల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’ అని నినాదాలు చేశారు. ఊహించని విధంగా వారు ఒక్కసారిగా తమ కాన్వాయ్ ముందు బైఠాయించడంతో మంత్రి ఇబ్బందిపడ్డారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు వినతిపత్రం ఇస్తామని పోలీసులను నమ్మించి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు.
మంత్రి బయటికిరావడంతో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కాన్వాయ్కి అడ్డుగా బైఠాయించారు. తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇవ్వాలని మొండికేశారు. 2006 నుంచి 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమని తొలగించడంతో రోడ్డున పడ్డామని తెలిపారు. 2020 మార్చిలో తమను పక్కన పెట్టారని, విధుల్లోకి తీసుకోవాలని 16 మాసాలుగా 7,651 మందిమి వేడుకుంటున్నా సీఎం కేసీఆర్, మంత్రులు స్పందించడంలేదని వాపోయారు. సీఎం కేసీఆర్ స్పందించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద అరగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకపోవడంతో వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి, ప్రధాన కార్యదర్శి సిద్దిరాజు, రాధాకృష్ణవేణి, వేల్పుల రాజు, కేశవులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.