పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-09-29T05:50:17+05:30 IST

జిల్లాలో పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంగనాథ్‌

 - ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ 

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 28 : జిల్లాలో పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగ్గించేలా కృషి చేసిన అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న క్రమంలో మంచి కృషి చేయాలని ఇందు కోసం కోర్టులో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాల్లో అధికారులంతా చురుకుగా పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసుల్లో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా గతంలో కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంచి, రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ మరింత సమర్ధంతంగా పనిచేస్తూ జిల్లాను తిరిగి అగ్రస్థానంలో నిలిపే విధంగా నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, ఆనంద్‌రెడ్డి, రమణారెడ్డి, సీఐలు సురే్‌షకుమార్‌, గౌరు నాయుడు, నిగిడాల సురేష్‌, చంద్రశేఖర్‌రెడ్డి, నాగరాజు, శంకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, పరమేష్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T05:50:17+05:30 IST