మహిళలపై వేధింపులు, హింసను అరికట్టేందుకు కృషి

ABN , First Publish Date - 2021-10-21T06:12:30+05:30 IST

మహిళలపై జరిగే వేధింపులు, హింసను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

మహిళలపై వేధింపులు, హింసను అరికట్టేందుకు కృషి
కలెక్టర్‌కు మెమొంటో అందజేస్తున్న సఖి కేంద్రం నిర్వాహకులు


- సఖి కేంద్రం ద్వారా 445 కేసుల పరిష్కారం

- మహిళా హెల్ప్‌లైన్‌ 181పై అవగాహన కల్పించాలి

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలపై జరిగే వేధింపులు, హింసను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌లో మహిళల సంరక్షణపై జిల్లా సమన్వయ కమిటీతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక హింస, ఆడపిల్లల రవాణా, పని చేసే చోట వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ కల్పిస్తూ, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ న్యాయ సలహాలను అందించేందుకు సఖి కేంద్రం పని చేస్తున్నదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 సైబర్‌ నేరాలు, ఐదు వరకట్న వేధింపుల కేసులు, 422 గృహ హింస కేసులు, ఐదు పోస్కో కేసులు, ఆరు బాల్య వివాహాల కేసులు, 45 ఇతర కేసులు, మొత్తం 527 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఇప్పటి వరకు 445 కేసులను పరిష్కరించామని వివరించారు. మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబరు 181పై అవగాహన కల్పించాలని, దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. జిల్లాలో నిర్వహించే మహిళా సంఘాల సమావేశాల్లో సఖి కేంద్రం నిర్వాహకులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఆర్‌డీవో, డీపీవోను ఆదేశించారు. సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందించే సేవల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. హింసకు గురవుతున్న మహిళల సంరక్షణ కోసం పోలీసు అధికారుల సహకారంతో అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్నారు. సఖి కేంద్రం వద్ద ఇద్దరు మహిళా హోంగార్డులను నియమించాలని అధికారులు కోరగా, వెంటనే స్పందించిన కలెక్టర్‌ డీసీపీని ఆదేశించారు. సఖి కేంద్రంలో కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. గృహ హింస కేసుల్లో భాగంగా చికిత్స కోసం పంపించే మహిళలకు ప్రభుత్వాసుపత్రుల్లో అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రాథమిక చికిత్స కిట్లను సఖి కేంద్రానికి అందజేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో డీసీపీ రవీందర్‌, జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌, డీఆర్‌డీవో శ్రీధర్‌, డీపీవో చంద్రమౌళి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:12:30+05:30 IST