ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-03-04T05:14:26+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తోందని ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. బుధవారం నగరంలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
విజయగనరం (ఆంధ్రజ్యోతి) మార్చి 3 :
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తోందని ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. బుధవారం నగరంలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా నాడు-నేడులో భాగంగా అక్కడ చేపట్టిన పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నతశిఖరాలు అధిరోహించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అందుకే కోట్లాది రూపాయలతో పాఠశాలల రూపురేఖలు మారుస్తోందని తెలిపారు. భవనాలతో పాటు, పరిసరాలు కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ సైతం ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ఎటువంటి భయం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ హరిజవహర్లాల్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ సెల్వి, మౌలిక వసతులు కల్పన సలహాదారు మురళి, జేసీ మహేష్కుమార్, డీఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ ప్రకటించండి
కలెక్టరేట్: జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని వెంటనే డీఎస్సీ ప్రకటించాలని, అంతవరకూ తాత్కాలికంగా ఉపాధ్యాయులు నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్కు వినతిపత్రం అదించారు. జిల్లా పర్యటకు వచ్చిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖ అధికారులతో నాడు-నేడుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను భోదనకు పరిమితం చేయాలన్నారు. రోజువారీ పాఠశాల నిర్వహణ సంబంధించి అనేక యాప్లు ఆప్లోడ్ చేయమంటున్నారని, దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీంతో భోదనకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. 2020 బదిలీలు, రి ఆప్రోషన్ వల్ల కొత్త పోస్టులు మంజూ రైనా, రెండు నెలలు నుంచి జీతాలు విడుదల కాలేదని చెప్పారు. తెలంగాణ నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు డీఏ తదితర విషయాలు , వారి జాయిన్ తేదీ నుంచి వర్తింపజేయాలన్నారు నాడు-నేడు పనుల బాధ్యతల నుంచి హెచ్ఎంలను తప్పించాలని కోరారు. పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు జేవీకే కిట్లు అందజేయాలని కోరారు.