సంచార జాతుల సమగ్ర అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2021-10-29T04:37:57+05:30 IST
సంచార జాతుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఏపీ ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న తెలిపారు.
ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న
విశాఖపట్నం, అక్టోబరు 28: సంచార జాతుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ఏపీ ఎంబీసీ (మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్) కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న తెలిపారు. సర్క్యూట్ హౌస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థిర నివాసం లేకుండా జీవిస్తున్న సంచార జాతుల వారికి గుర్తింపు, గౌరవం ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు.
ఇప్పటికే 44 వేల మంది సంచార జాతుల కుటుంబాలకు జగనన్న కాలనీల్లో స్థిర నివాసం ఏర్పాటు చేశారని, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 61 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. సంచార జాతుల్లో 52 కులాలు ఉండగా, అందులో 32 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని చెప్పారు.
వీటిలో కుల ధ్రువీకరణ పత్రాలు కూడా పొందలేని వారున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చి సంచార జాతుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తరపున సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంచార జాతుల ప్రతినిధులు కె.రామన్నపాత్రుడు, కొటాన రాము తదితరులు పాల్గొన్నారు.